- రాహుల్ పై ఎంపీ కంగనా రనౌత్ వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదు..
- ఖండించిన మహిళా కాంగ్రెస్ నాయకురాలు డా. రేఖ బోయలపల్లి..
లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ కంగనా రణౌత్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు డా. రేఖ బోయలపల్లి ఖండించారు. ఇటువంటి వ్యాఖ్యలు రాజకీయ సంభాషణ స్థాయిని దిగజార్చే ప్రయత్నమని ఆమె పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది కేవలం వ్యక్తిగత దాడి మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య విలువలను అవమానించడం వంటిదని ఆమె అన్నారు.
మహిళా సాధికారత కోసం రాహుల్ గాంధీ నిరంతరం కృషి చేస్తున్నారని డా. బోయలపల్లి తెలిపారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా మహిళలతో ప్రత్యక్షంగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం, మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలనే అంశంపై ఆయన స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేయడం ఆయన నాయకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.
మహిళల భద్రత, గౌరవం, ఆర్థిక స్వావలంబనపై ఆయన ఎప్పటికప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారని, సమాన అవకాశాల కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. వ్యక్తిగత విమర్శలు, సంచలన వ్యాఖ్యలు కాకుండా ప్రజా సమస్యలపై దృష్టి సారించడం నిజమైన రాజకీయమని, రాహుల్ గాంధీ అదే మార్గంలో కొనసాగుతున్నారని ఆమె పేర్కొన్నారు.
ఇలాంటి నాయకత్వాన్ని తక్కువ చేసి చూపేందుకు అసభ్య పదజాలం వినియోగించడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు. దేశానికి గౌరవం, సమానత్వం, సాధికారతను ముందుకు తీసుకెళ్లే నాయకత్వం అవసరమని, ఆ విలువలను ప్రతిబింబించే నాయకుడిగా రాహుల్ గాంధీ నిలుస్తున్నారని డా. బోయలపల్లి తెలిపారు.
