- ఆస్తుల పంపకం చేయలేదు..
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సతీమణి వైఎస్ విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ మరణం వరకూ ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని, ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం వైఎస్ఆర్ కుటుంబ ఆస్తులపై నోటరీ చేసిన స్టేట్మెంట్ను ఆమె రిలీజ్ చేశారు. ఇటీవల వైసీపీ నాయకులు కొందరూ వైఎస్ ఆస్తులపై చేస్తున్న ప్రకటనకు ఆమె స్పందించారు.
ఆస్తులు నలుగురు మనుమలకు సమానంగా పంచాలని వైఎస్ఆర్ ఉద్దేశ్యమని, ఈ విషయం వైఎస్ఆర్ దగ్గర వాళ్లందరికీ తెలిసిన వాస్తవమిదని వెల్లడించారు. ఎంవోయూలో రాసిన ప్రతి ఆస్తి షర్మిలకు చెందాల్సినవేనని ,సరస్వతి సిమెంట్తో సహా ఎంవోయూలో ఏని యెలహంక ల్యాండ్ కూడా షర్మిలదేనని తెలిపారు.
ఇచ్చాను అని చెప్తున్న డబ్బు షర్మిల వాటాకు వచ్చిన డివిడెండ్ మాత్రమేనని అన్నారు. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి అన్యాయం చేశాడని ఆరోపించారు. ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తల్లిగా ఆశిస్తున్నానని తెలిపారు. ఇప్పుడు షర్మిలకు ఇచ్చిన ఆస్తుల లాంటివి జగన్కు కూడా ఇచ్చారని వెల్లడించారు.
నిజం ఏమిటో నా దేవుడికి, నా కొడుకుకు కూడా తెలుసు. గోబెల్ ప్రచారం చేయడానికి మీరు ఎవరు అంటూ వైసీపీ నాయకులను ప్రశ్నించారు. అసత్యాల ప్రచారం మానుకోవాలని వైఎస్సార్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నానని, కుటుంబ ఆస్తులపై మరోసారి మీడియాలో ప్రస్తావించవద్దని వైఎస్ విజయలక్ష్మి కోరారు.
