- జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
అక్రమ మొరం తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. మంగళవారం సారంగాపూర్ మండలంలోని జాం గ్రామ చెరువు సమీపంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల అవసరాల కోసం మొరం తవ్వకాలు చేపట్టాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా రెవెన్యూ అధికారుల అనుమతి పొందిన తర్వాత మాత్రమే తవ్వకాలు చేయాలని సూచించారు. అక్రమ మొరం తవ్వకాలపై రెవెన్యూ అధికారులు పటిష్ట నిఘా ఉంచాలని ఆదేశించారు.

మొరం, ఇసుక అక్రమ తవ్వకాలు చేసే వారిపై అలాగే అక్రమంగా రవాణా చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, మైనింగ్ అధికారి హరి ప్రసాద్, తహసిల్దార్ సంధ్యారాణి, రెవెన్యూ అధికారులు, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
