- జిల్లా అధికార యంత్రాంగం బిజీ బిజీ
- 11న మున్సిపల్ ఎన్నికలు
- 15-18 వరకు ఏడుపాయల జాతర
- జిల్లా కలెక్టర్, ఎస్పీ లు ముందస్తు ప్రణాళికలు
మెదక్ జిల్లాలో ఈ నెల ఒకేసారి రెండు పండుగలకు వేదికగా మారింది. ఒకటి ప్రజాస్వామ్య పండుగ అయినటువంటి మున్సిపల్ ఎన్నికలు, మరొకటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వనదుర్గామాత జాతర. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉంది. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా, 15 నుంచి 17 వరకు ఏడుపాయల జాతర నిర్వహించనున్నారు.
దీంతో ఎన్నికల నిర్వహణతో పాటు జాతర ఏర్పాట్ల బాధ్యతలను ఒకేసారి నిర్వర్తించాల్సిన పరిస్థితి జిల్లా యంత్రాంగానికి ఏర్పడింది. ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, సిబ్బంది నియామకాలు, భద్రతా చర్యలు వంటి పనులు కొనసాగుతున్నాయి. అదే సమయంలో జాతరకు వచ్చే భక్తుల కోసం తాగునీరు, వైద్య సదుపాయాలు, పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై కూడా అధికారులు దృష్టి సారించారు.

ఏడుపాయల జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో, పోలీసు,రెవెన్యూ, ఎండోమెంట్, పంచాయతీరాజ్, వైద్య, ఆర్ డబ్ల్యూ ఎస్ సహ ఇతర శాఖలను సమన్వయ పరుస్తూ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల విధులు, జాతర ఏర్పాట్లు రెండూ సాఫీగా సాగేందుకు ముందస్తు ప్రణాళికతో జిల్లా కలెక్టర్, ఎస్పీ శ్రీనివాస్ రావు చర్యలు తీసుకుంటున్నారు.
మొత్తానికి, ప్రజాస్వామ్య ప్రక్రియ అయిన ఎన్నికలు మరియు భక్తి శ్రద్ధలతో జరిగే జాతర… ఈ రెండింటినీ సమన్వయంగా నిర్వహించేందుకు మెదక్ జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. కాగా ఆదివారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వివిధ శాఖల అధికారులతో ఏడుపాయలను సందర్శించి జాతర సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ రెడ్డి, మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
