కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ నిధులతో..
బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల నిర్మాణం
నల్లగొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలను కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్(Komatireddy Prateek Foundation) నిధులతో అద్భుతంగా నిర్మించారు. మన దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో ప్రభుత్వ పాఠశాలలు ఉండాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ స్థాయి వాల్డార్ఫ్ విద్యా విధానం(Waldorf Education) స్ఫూర్తితో ముందుకు సాగారు. ఏసీ సౌకర్యంతో డిజిటల్ క్లాస్రూమ్స్, 45 కంప్యూటర్లతో కంప్యూటర్ ల్యాబ్, STEM విద్య, గ్రంథాలయం, స్పోర్ట్స్ రూమ్స్, యోగా సెంటర్ వంటి ఆధునిక వసతులను అందుబాటులోకి తెచ్చారు. ఈ పాఠశాలకు కోమటిరెడ్డి ప్రతీక్ పేరు పెట్టేందుకు అంగీకరించిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య అందాలన్న నా చిరకాల కల ఈ రోజు నల్గొండ బొట్టుగూడలో నిజమైంది. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ నిధులతో 2500 గజాల స్థలంలో సకల ఆధునిక సౌకర్యాలతో ఈ ప్రభుత్వ పాఠశాల నిర్మాణం జరిగింది. ప్రభుత్వ పాఠశాల కూడా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు సమానంగా కాక వాటిని మించిన ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది. మార్కులు, ర్యాంకులకే పరిమితం కాకుండా పిల్లల సృజనాత్మకతను వెలికితీసే వాల్డార్ఫ్ విద్యా విధానం, డిజిటల్ క్లాస్రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, ప్రతి గదిలో ఏసీ సౌకర్యం, స్టెమ్ విద్యతో ఈ పాఠశాల ప్రత్యేకతను చాటుతోంది. అనుభవాత్మక విద్య ద్వారా భావి శాస్త్రవేత్తలు, ఐఏఎస్, ఐపీఎస్లుగా విద్యార్థులను తీర్చిదిద్దడమే మా లక్ష్యం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా ఎల్లప్పుడూ అండగా ఉంటాం’ అని చెప్పారు.
