నారాయణపేట జిల్లా దన్వాడ మండలం కంసానపల్లిలో ఆదివారం నిర్వహించిన వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకం(Vikasit Bharat Ji Ram Ji Scheme) అవగాహన సదస్సు(Awarness Programme)లో మహబూబ్నగర్(Mahabubnagar MP) ఎంపీ డీకే అరుణ(DK Aruna) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో ఉపాధి హామీ పథకంలో 100 రోజులు మాత్రమే ఉపాధి కల్పిస్తే.. జీ రామ్ జీ పథకం ద్వారా ఉపాధి కల్పన 125 రోజులకు పెంచారని తెలిపారు. గ్రామంలో జరగాల్సిన అభివృద్ధి పనులు గ్రామ సభ తీర్మానం చేసుకునే అవకాశం జీ రామ్ జీ పథకం కల్పిస్తోందని చెప్పారు. గ్రామ పంచాయతీలకు నేరుగా మోదీ ప్రభుత్వం నిధులు ఇస్తుందని వెల్లడించారు.
డీకే అరుణ ఇంకా ఏమన్నారంటే..
‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా.. గ్రామాలకు రూపాయి ఇవ్వడం లేదు. దేశంలో పేదరికాన్ని, నిరుద్యోగాన్ని తగ్గించేందుకు, అక్షరాస్యత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. గ్రామాలు వికసించినప్పుడే దేశ వికాసం సాధ్యపడుతుంది. ఉపాధి హామీ పనులకు జీ రామ్ జీ పేరు పెట్టడాన్ని కాంగ్రెస్ తప్పుపడుతోంది. కానీ.. మహాత్మాగాంధీ చివరిసారిగా పలికిన హే రామ్ పదం వచ్చేలా జీ రామ్ జీ పేరు పెట్టారు. జీ రామ్ జీ పథకంతో కేంద్రం ఇస్తున్న నిధులు ఏమాత్రం తగ్గవు. కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 40 శాతం నిధులు ఇస్తే గ్రామాల్లో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందనేది కేంద్రం ఉద్దేశం.
గత ప్రభుత్వంలో చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు మంజూరుచేయలేదు. ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో కూడా పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడం లేదు. రెండేళ్లుగా ఎన్నికలు జరగకపోవడంతో గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయాయి. ఇటీవల ఎన్నికలు పూర్తికావడంతో త్వరలో ఆ గ్రామాలకు నిధులు వస్తాయి. గ్రామాలను ముందుచూపుతో, సమిష్టి నిర్ణయాలతో అభివృద్ధి చేసుకోవాలి. ఎంపీ నిధుల నుంచి కూడా గ్రామాల అభివృద్ధికి అండగా ఉంటాను’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కూలీలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
