- నాలుగు పోలీస్ కమిషరేట్లు ఏర్పాటు చేస్తూ నిర్ణయం ..
- కమిషనరేట్ల పరిధి నుంచి భువనగిరి జిల్లా మినహాయింపు..
- ఫ్యూచర్ సిటీ కమిషనర్ గా సుధీర్ బాబు..
- సైబరాబాద్ సీపీగా రమేష్ రెడ్డి..
- రాచకొండ కమిషనర్గా అవినాష్ మహంతి..
- యాదాద్రి జిల్లా ఎస్పీగా అక్షాన్స్ యాదవ్
ప్రజలకు మెరుగైన భద్రత, నేర నియంత్రణలో సమర్థత పెంచే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరిస్తూ నాలుగు కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ సిటీ ప్రాంతానికి ప్రత్యేక పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలు ఈ కమిషనరేట్ పరిధిలోకి రానున్నాయి. ఫ్యూచర్ సిటీ కమిషనర్గా సుధీర్ బాబు నియమితులయ్యారు. ఐటీ, పారిశ్రామిక ప్రాంతాలతో కూడిన సైబరాబాద్ కమిషనరేట్కు రమేష్ రెడ్డిని పోలీస్ కమిషనర్గా ప్రభుత్వం నియమించింది.
గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, నానక్రామ్గూడ, రాయదుర్గ్, పఠాన్ చెరు, జీనోమ్ వ్యాలీ, అవిూన్పూర్ తదితర ప్రాంతాలు ఈ పరిధిలో కొనసాగనున్నాయి. రాచకొండ కమిషనరేట్ను పునర్ వ్యవస్థీకరించి మల్కాజ్గిరి కమిషనరేట్గా కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ కమిషనరేట్కు అవినాష్ మహంతి కమిషనర్గా నియమితులయ్యారు. కీసర, శావిూర్పేట, కుత్బుల్లాపూర్, కొంపల్లి వంటి ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి. ఇప్పటి వరకు రాచకొండ పరిధిలో ఉన్న భువనగిరి ప్రాంతాన్ని విడదీసి, యాదాద్రి భువనగిరి జిల్లాకు ప్రత్యేక ఎస్పీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీగా అక్షాన్స్ యాదవ్ను నియమించారు.

హైదరాబాద్ నగరానికి సంబంధించిన కీలక ప్రాంతాలను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకువచ్చారు. అందులో అసెంబ్లీ, సెక్రటేరియట్, బేగంపేట, శంషాబాద్ విమానాశ్రయం, బుద్వేల్ హైకోర్టు వంటి అత్యంత ప్రాధాన్య ప్రాంతాలు ఉన్నాయి.2047 విజన్లో భాగంగా సంస్కరణలుతెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రజలకు వేగవంతమైన సేవలు, మెరుగైన శాంతిభద్రతలే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
