- పండగల నేపథ్యంలో కొన్ని తేదీల్లో సవరణ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఫిబ్రవరి 23 నుంచి జరగాల్సిన ఈ పరీక్షల షెడ్యూల్లో బోర్డు అధికారులు పలు మార్పులు చేసి సవరించిన టైం టేబుల్ని శుక్రవారం విడుదల చేశారు. హోలీ, రంజాన్ పండుగల నేపథ్యంలో మార్చి 3న జరగాల్సిన ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ పేపర్2ఏ, సివిక్స్ పేపర్2 పరీక్షలను మార్చి 4వ తేదీకిÑ మార్చి 20న జరగాల్సిన ప్రథమ ఇంటర్ పబ్లిక్ అడ్మినిస్టేష్రన్ పేపర్ 1, లాజిక్ పేపర్ 1 పరీక్షలను మార్చి 21కి రీషెడ్యూల్ చేశారు. మిగతా పరీక్షలన్నీ షెడ్యూల్ ప్రకారం యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేశారు.
ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు.. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23 వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు గతంలో అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఇది తాత్కాలిమైన షెడ్యూలేనని, పర్వదినాల నేపథ్యంలో మార్పులు ఉండొచ్చని కూడా ప్రకటించారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన 2026 సెలవుల జాబితాలో మార్చి 3న హోలీ, 20న రంజాన్ ఉండటంతో అందుకనుగుణంగా ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేసి రివైజ్డ్ టైం టేబుల్ని విడుదల చేశారు.
