54 లక్షల మందికి పైగా పిల్లల కోసం భారీ ఏర్పాట్లు
వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడి
ఈ నెల 21న పల్స్ పోలియో (Pulse Polio) కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారని వైద్యారోగ్య శాఖ మంత్రి (AP Health Minister) సత్యకుమార్ (Satya Kumar) తెలిపారు. 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కల్ని తప్పకుండా వేయించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 54,07,663 మంది 5 ఏళ్ల లోపు పిల్లలకు 38,267 బూత్లలో పోలియో చుక్కలు వేసేందుకు ఇప్పటికే జిల్లాలకు 61,26,120 డోస్లను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపించారని వెల్లడించా. డిసెంబర్ 21న పోలియో డే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయిలో పిల్లలకు పోలియో చుక్కల్ని వేస్తారని, ఆరోజు పలు కారణాల వల్ల పోలియో చుక్కలు వేసుకోలేకపోయిన పిల్లలకు తిరిగి ఈ నెల 22, 23 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి 76,534 బృందాలు పరిశీలిస్తాయని మంత్రి పేర్కొన్నారు.
ఇండియా పోలియో రహిత దేశం (India Polio Free Country) అయినప్పటికీ మళ్లీ పోలియో రాకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించిందని తెలిపారు. 1704 మంది వైద్యాధికారులు, 39494 మంది ఇతరులు (ఫార్మాసిస్టులు, నర్సింగ్ విద్యార్థులు, ఇతర సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులు), 4206 మంది పర్యవేక్షకులు నేషనల్ ఇమ్యునైజేషన్ డేలో పాల్గొంటారని తెలిపారు. పల్స్ పోలియో ఏర్పాట్లకు సంబంధించి వైద్యారోగ్య శాఖ కార్యదర్శి అధ్యక్షతన స్టేట్ టాస్క్ ఫోర్స్ సమావేశం జరిగిందని చెప్పారు. జిల్లా, పట్టణ, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశాలు (Task Force Meetings) జరుగుతున్నాయని, ఏర్పాట్ల గురించి ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ లేఖలు రాశారని మంత్రి పేర్కొన్నారు.
1854 మొబైల్ బృందాలు.. 1140 ట్రాన్సిట్ బూత్లు..
పలు ప్రాంతాల్లో తిరిగేందుకు మొబైల్ బృందాలను ఏర్పాటుచేశారు. ప్రతి మొబైల్ బృందంలో ఒక మెడికల్ ఆఫీసర్తోపాటు ఇద్దరు సభ్యులు ఉంటారు. ఈ నెల 21 నుంచి 23 వరకు మొబైల్ బృందాలు పర్యటిస్తాయి. ఈ నెల 22, 23 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి 5 ఏళ్లలోపు పిల్లలందరినీ పరిశీలించి, పోలియో చుక్కలు వేస్తారు. ఇంటిలోని పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తే “P” గుర్తు, ఏ చిన్నారైనా మిస్ అయితే “X” గుర్తు వేస్తారు. అన్ని ట్రాన్సిట్ పాయింట్లలో(బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ప్రధాన ఆస్పత్రులు, మేళాలు, బజార్లు మొదలైనవి) ఈ నెల 21 నుంచి 23 వరకు ట్రాన్సిట్ బృందాలు పర్యటిస్తాయి. గుర్తించిన పలు ప్రాంతాలను (స్లమ్లు, సంచార జాతులు, నిర్మాణ స్థలాలు, ఇటుక క్షేత్రాలు, ఇతర వలస ప్రాంతాలు) కవర్ చేయడానికి 1854 మొబైల్ బృందాలు పనిచేస్తాయి. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, మేళాలు, బజార్లు, పర్యాటక ప్రదేశాల్లో 1140 ట్రాన్సిట్ బూత్లను ఏర్పాటుచేశారు.
