మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఆధ్యాత్మిక (Spiritual) నీడలో.. ఆ పరమశివుడి ఆశీస్సులతో అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్ముతూ ఆద్యంతం ఆ పరమశివుడి (Lord Shiva) భక్తిసారంతో నిండిన పవిత్ర కార్తీక మాసాన్ని (Kartheeka Maasam) పురస్కరించుకొని ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లా పరిధిలోని సత్తుపల్లి, కొత్తగూడెం ప్రాంతాల్లో నిర్వహించిన పలు సామాజిక వర్గాల కార్తీక మాస వన సమారాధన (Vana Samaradhana) కార్యక్రమాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
మొదట.. సత్తుపల్లి పట్టణంలోని గౌరిగూడెంలో ఉన్న మామిడి తోటలో రెడ్డి వారి కార్తీక మాస వన సమారాధనలో పాల్గొన్నారు. అనంతరం.. సత్తుపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం నిర్వహించిన వన సమారాధన కార్యక్రమంలో, తర్వాత.. కొత్తగూడెం రైటర్ బస్తీలో ఆర్యవైశ్య సంఘం నిర్వహించిన కార్తీక మాస వన సమారాధనలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుంచి లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రపురం మామిడి తోటకు వెళ్లి రెడ్డి సంఘం వన సమారాధనలో ముఖ్య అతిథిగా పాల్గొని అందరితో కలిసి భోజనం చేశారు.
కార్తీక వన సమారాధనలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ఇలాంటి కార్యక్రమాలు సామాజిక ఐక్యతను, కుటుంబ బంధాల అనురాగాన్ని దృఢపరుస్తాయని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు సమిష్టిగా కృషి చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.
