మాల ధరించిన విద్యార్థిని అవమానపరచినందుకు వేటు
హనుమాన్ మాల ధరించిన విద్యార్థిని తరగతి గది నుంచి వెళ్లగొట్టిన ఉపాధ్యాయుడు
అతనిపై విచారణ అనంతరం సస్పెన్షన్ ఉత్తర్వుల జారీ
నల్గొండ, నవంబర్ 16 (ఆదాబ్ హైదరాబాద్): హిందూ సంప్రదాయ, ధార్మిక మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన మునుగోడు మండలం పలివెల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు గ్యార నర్సింహపై అధికారులు చర్యలు చేపట్టారు. హనుమాన్ మాల (Hanuman Mala) ధరించి పాఠశాలకు వచ్చిన 10వ తరగతి విద్యార్థి పట్ల అమానుషంగా వ్యవహరించినందుకు సస్పెన్షన్ వేటు వేశారు.

ఈ మేరకు జిల్లా విద్యా శాఖ అధికారి (DEO) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11న ఈ ఘటన జరిగింది. కోడూరి శివశంకర్ అనే విద్యార్థి హనుమాన్ మాల ధరించి పాఠశాలకు వచ్చాడు. దీంతో టీచర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ అవహేళనగా మాట్లాడాడు. అనుచితంగా ప్రవర్తించి అతణ్ని తరగతి గది (Class Room) నుంచి బయటికి వెళ్లగొట్టాడు. విద్యార్థి మాలధారణను అవమానిస్తూ తరగతిలో ఉండటానికి వీల్లేదని ఉపాధ్యాయుడు అన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
హిందూ సంఘాలు, బీజేపీ నాయకుల ఫిర్యాదు..
ఈ ఘటన గురించి తెలుసుకున్న హిందూ సంఘాల నాయకులు, భారతీయ జనతా పార్టీ (BJP) యువ మోర్చా నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యార నర్సింహపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా భారతీయ యువ మోర్చా డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులను ఆశ్రయించారు. వారు జిల్లా కలెక్టర్, విద్యా శాఖ అధికారి(DEO)ని కలిసి రాతపూర్వక ఫిర్యాదు చేశారు.

విచారణ.. సస్పెన్షన్..
ఫిర్యాదు అందిన వెంటనే జిల్లా అధికారులు ఈ ఘటనపై విచారణ(Inquiry)కు ఆదేశించారు. ఉపాధ్యాయుడు నర్సింహ వ్యవహరించిన తీరు ధార్మిక మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో.. విచారణ నివేదిక ఆధారంగా సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకున్నారు.
