- వృత్తిపరమైన ఫీజులతోనే నిధులు సమకూర్చుకున్న
- ఆదాయపు పన్ను చెల్లించి పార్టీకి విరాళం ఇచ్చినట్లు ప్రశాంత్ కిశోర్ వెల్లడి
- బీహార్ ఎన్నికల ముందు పికె వ్యాఖ్యలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల దశలో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. వృత్తిపరంగా రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన కాలంలో తన ప్రతిభతోనే పెద్ద మొత్తంలో పారితోషికం పొందిన విషయాన్ని ఆయన వెల్లడించారు. నేను కేవలం రెండు గంటలు సలహా ఇచ్చి రూ.11 కోట్లు సంపాదించాను. ఇదే బీహార్ యువకుడి సామర్థ్యం అని కిశోర్ పేర్కొన్నారు. తన పార్టీకి నిధులు డొల్ల కంపెనీల ద్వారా వస్తున్నాయన్న ఆరోపణలను ఖండించిన ఆయన, అవన్నీ వృత్తిపరమైన, ఆదాయమేనని స్పష్టం చేశారు. జీఎస్టీ, ఆదాయపు పన్ను చెల్లించి నేను సంపాదించిన డబ్బునే పార్టీకి విరాళంగా ఇచ్చానని వివరించారు. ఈ సందర్భంగా బీహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. 1995లో నమోదైన హత్య కేసులో చౌదరిని దోషిగా తేల్చారని, అయినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. “వెంటనే ఆయనను అరెస్టు చేయాలి. మైనర్ అని తప్పుడు పత్రాలు చూపించి శిక్ష నుండి తప్పించుకున్నారని ఆరోపించారు. అదేవిధంగా పదో తరగతి కూడా పూర్తి చేయలేని వ్యక్తి డిగ్రీ పట్టా ఎలా పొందారన్నది ప్రశ్నార్ధకమని వ్యాఖ్యానించారు. లాలూ ప్రసాద్ కుటుంబంపై కూడా ప్రశాంత్ కిశోర్ ఎద్దేవా చేశారు.
ప్రజలు తమ పిల్లలను ఎలా చదివించాలో లాలూ ప్రసాద్ను చూసి నేర్చుకోవాలి. ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ తొమ్మిదో తరగతి కూడా పాస్ కాలేదు. అలాంటి వాడిని బీహార్కు రాజుగా నిలబెట్టాలని లాలూ తపనపడుతున్నారని విమర్శించారు. అదే సమయంలో, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సామాన్యుల పిల్లలకు ఉద్యోగాలు దొరకకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.