- అక్రమంగా కమర్షియల్ డ్రైవర్స్ గా పనిచేస్తున్నట్లు గుర్తింపు..
- దేశం నుంచి బహిష్కరించేందుకు ప్రక్రియ ప్రారంభం..
అమెరికాలో అక్రమంగా నివసిస్తూ, కమర్షియల్ ట్రక్కు డ్రైవర్లుగా పనిచేస్తున్న సుమారు 30 మంది భారత పౌరులను యూఎస్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు అరెస్ట్ చేశారు. ఫెడరల్ అధికారులు నిర్వహించిన ఒక ప్రత్యేక ఆపరేషన్లో వీరు పట్టుబడ్డారు. అరెస్టయిన వారందరినీ దేశం నుంచి బహిష్కరించే ప్రక్రియను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
అరిజోనాలోని యూమా సెక్టార్లో మే 11 నుంచి 15 మధ్య ‘ఆపరేషన్ చెక్మేట్’ పేరుతో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్లో దేశంలో అక్రమంగా నివసిస్తున్న మొత్తం 52 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 36 మంది సెమీ ట్రక్కులు నడుపుతూ పట్టుబడగా, వారిలో 30 మంది భారత పౌరులు ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన ఆరుగురిలో మెక్సికో, ఎల్ సాల్వడార్, రష్యా దేశస్థులు ఉన్నారు.
వాణిజ్య వాహనాలు నడుపుతున్న అక్రమ వలసదారులపై ఇమ్మిగ్రేషన్ చట్టాలను కఠినంగా అమలు చేయడం ద్వారా ప్రజా భద్రతను మెరుగుపరిచే ప్రయత్నాల్లో భాగంగానే ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ఒక ప్రకటనలో పేర్కొంది. సరఫరా వ్యవస్థకు కీలకమైన ట్రక్కింగ్ పరిశ్రమలో నిబంధనల ఉల్లంఘనలను అరికట్టడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది. పట్టుబడిన చాలా మంది వద్ద ఉన్న ఉపాధి పత్రాలు వారి చట్టబద్ధమైన హోదాకు సరిపోలడం లేదని అధికారులు గుర్తించారు
