- తీవ్ర విమర్శలు చేసిన నారా చంద్రబాబు..
పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఇండియా కూటమి పక్షాలు అడ్డుకున్నాయని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఎన్డీఏ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇవాళ ఆయన ఎన్డీఏ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. మహిళలకు అన్యాయం చేసిన పార్టీల వైఖరిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
ఈ నెల 30వ తేదీలోగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. ఇండియా కూటమి తీరును నిరసిస్తూ ‘స్త్రీ శక్తి’ పేరుతో సదస్సులు నిర్వహించాలని సూచించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పూర్తి సమన్వయంతో ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. “మహిళా రిజర్వేషన్లను అడ్డుకుని ఇండియా కూటమి పార్టీలు మహిళలకు తీవ్ర అన్యాయం చేశాయి. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే పార్టీలకు ఒక్క మహిళ కూడా ఓటు వేయకూడదు. ఎన్డీఏ మహిళా పక్షపాతి అయితే, ఇండియా కూటమి మహిళా వ్యతిరేకి” అని వ్యాఖ్యానించారు.
మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ 1996 నుంచి అడ్డుకుంటూనే ఉందని చంద్రబాబు విమర్శించారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభలో బిల్లు పెడితే బీజేపీ మద్దతిచ్చిందని, కానీ లోక్సభలో మాత్రం కాంగ్రెస్ ఆ బిల్లును ప్రవేశపెట్టలేదని గుర్తుచేశారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బిల్లు తీసుకొస్తే, డీలిమిటేషన్ అనే సాకు చూపి దానిని వీగిపోయేలా చేశారని ఆరోపించారు.
