దక్షిణ భారతదేశ (South India) పర్యాటకానికి (Tourism) ఏపీ ముఖ ద్వారమని మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) లండన్ వేదికగా తెలిపారు. మూడో రోజు లండన్ పర్యటనలో వరల్డ్ ట్రావెల్ మార్కెట్(World Travel Market)-2025 ప్రదర్శనలో ఏర్పాటుచేసిన ఇతర రాష్ట్రాల, దేశాల స్టాల్స్ను, టూరిజం బోర్డులను పరిశీలించారు. ఉమ్మడి మార్కెటింగ్ ప్రచారం కోసం వివిధ దేశాల, రాష్ట్రాల టూరిజం అధికారులతో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో పర్యాటక అభివృద్ధికి అనుసరిస్తున్న విధానాలు, అభివృద్ధి ప్రణాళికపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రధానంగా సౌదీ, రియాద్, మాల్దీవులు, కొలంబియా, శ్రీలంక, వియత్నాం, ఆస్ట్రియా, థాయిలాండ్, జర్మనీ, సింగపూర్, ఇటలీ, స్వీడన్, పోలాండ్, టర్కీ దేశాలు టూరిజం రంగంలో అవలంభిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా దేశాల ప్రతినిధులతో భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం.. వచ్చే ఏడాది సౌదీలో నిర్వహించనున్న అరేబియన్ ట్రావెల్ మార్కెట్(Arabian Travel Market)కు హాజరుకావాలని ఆ దేశ ప్రతినిధులు మంత్రి దుర్గేష్ను ఆహ్వానించారు.
