- సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పెళ్లి కార్డు..
టాలీవుడ్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ విషయం హాట్ టాపిక్గా మారింది. వీరి వివాహం ఈ నెల 26న జరుగుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల వారి పెళ్లి కార్డు నెట్టింట లీక్ అవ్వడం మరింత చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ టీమ్ అధికారికంగా స్పందించింది. సోషల్ మీడియాలో పెళ్లి, రిసెప్షన్కు సంబంధించిన పూర్తి వివరాలను షేర్ చేయడం సరైంది కాదని వారు స్పష్టం చేశారు.
విజయ్, రష్మిక వివాహానికి సంబంధించి కొందరు సోషల్ మీడియాలో వివిధ పోస్టులు చేస్తున్నారు. పెళ్లి తేదీ నుంచి రిసెప్షన్ వివరాల వరకు వెల్లడిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. వివాహ వేడుకలకు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో కార్యక్రమానికి సంబంధించిన వివరాలు బయటకు రావడం వల్ల అతిథులకు ఇబ్బందులు కలగవచ్చు.
అంతేకాకుండా, వెడ్డింగ్ కార్డుపై ఉన్న కాంటాక్ట్ ఫోన్ నెంబర్ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగత కార్యక్రమం. అలాంటి వ్యక్తిగత వేడుకలకు సంబంధించిన సమాచారం షేర్ చేసే ముందు దాని ప్రభావాన్ని ఆలోచించాలి అని విజయ్ టీమ్ పేర్కొంది. సెలబ్రిటీల జీవితాలు ఎప్పుడూ ప్రజల దృష్టిలోనే ఉంటాయి. అయితే, వ్యక్తిగత విషయాల్లో గోప్యతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా విజయ్ టీమ్ సూచించింది.
