- మంజీరాలోని ఇసుక నిర్మాణాలకు పనిచేయదన్న అధికారులు
- మరి మంజీరా నుంచి తెచ్చిన అక్రమ ఇసుకకు వేలం ఎందుకో..?
- వేలం దక్కించుకున్న వారు నిర్మాణాలకు వాడితే పనికొస్తుందా..?
- చిలిపిచేడ్ మండల ప్రజలలో వ్యక్తమవుతున్న ధర్మసందేహాలు..
- ఎమ్మార్వో సహదేవ్ సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్..
చిలిపిచేడ్ మండల పరిధిలోని మంజీరా నదిలో నుంచి అక్రమంగా ఇసుకను ఇండ్ల నిర్మాణాల కోసం తరలించకూడదని, ఆ ఇసుక నాణ్యమైనది కాదని,అసలు అది నిర్మాణాలకు పనికి రాదని తహశీల్దారు సహదేవ్ ఇటీవల పత్రికా ప్రకటనలలో పేర్కొన్నారు.మరోవైపు ఇటీవల మంజీరా నదిలో నుంచి అక్రమంగా ఇసుకను తవ్వి నిల్వచేసిన ఇసుక కుప్పలను స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు ఆ ఇసుకను వేలం వేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
దీంతో మండల వ్యాప్తంగా ప్రజలలో ఓ ధర్మసందేహం ప్రజలను తొలిచి వేస్తుందని,మండల రెవెన్యూ అధికారులు చేసిన ప్రకటనలు ఎవరిని మోసం చేయడానికి అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.ఓ వైపు మంజీరా నదిలో నుంచి తీసిన ఇసుక ఇండ్ల నిర్మాణాలకు పనికి రాదని స్వయంగా తహశీల్దారు మండల ప్రజలకు సూచనలు చేయడం,మరోవైపు మంజీరా నదిలో నుంచి అక్రమంగా నిల్వచేసిన ఇసుకకు వేలం వేస్తూ ప్రకటనలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

అధికారులకు ఆదాయం తెచ్చే అక్రమ ఇసుక వేలంతో మోసపోయేది ఎవరో…అది ఎందుకు పనికి వచ్చే ఇసుక అని,అది నిర్మాణాలకు పనికి రాని ఇసుక అయినప్పుడు ఎందుకు వేలం వేస్తున్నారు అనే ప్రశ్నలు గ్రామాలలో ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.అధికారుల ద్వంద్వ ప్రకటనలు ప్రజలలో ప్రభుత్వంపై విశ్వాసాలను సన్నగించేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.దీనికి స్థానిక తహశీల్దారు రెవెన్యూ అధికారులు స్పష్టమైన వివరణ ఇస్తారా లేదా వేచి చూడాల్సిందే..
తహశీల్దార్ సహదేవ్ వివరణ
ఇసుక వేలంపై”ఆదాబ్ ప్రతినిధి” తహశీల్దార్ సహదేవ్ ను వివరణ కోరగా ప్రభుత్వ ఆదేశానుసారమే ఇసుక వేలం వేస్తున్నామని,అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే ఇసుక డీడీలు కట్టి వేలంలో పాల్గొంటారని చెప్పడం గమనార్హం..
