- యాప్ పనితీరు పట్ల రైతులు సంతృప్తి
- రెండురోజుల్లో యాప్ ద్వారా 60,510 బస్తాలు కొనుగోలు
- త్వరలో అన్ని జిల్లాలలో అమలుకు సన్నాహాలు
వ్యవసాయశాఖ ద్వారా ప్రవేశపెట్టిన యూరియా యాప్ 5 జిల్లాలలో ప్రయోగాత్మకంగా గత రెండ్రోజుల నుండి పరిశీలించడం జరిగిందని, 5 జిల్లాలలో దాదాపు లక్ష మందికి పైగా డౌన్ లోడ్ చేసుకోవడం జరిగిందని మంత్రి తుమ్మలనాగేశ్వర రావు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో 897, జనగామ జిల్లాలో 5150, మహబూబ్ నగర్ 3741, నల్లగొండ 3618 మరియు పెద్దపల్లి జిల్లాలోని 6289 మొత్తం 19695 మంది రైతులు ఈ యాప్ ద్వారా యూరియాను తమ సవిూప డీలర్ దగ్గర 60,510 యూరియా బస్తాలు బుక్ చేసుకోవడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా 217 మంది కౌలు రైతులు కూడా 678 యూరియా బస్తాలు ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవడం జరిగిందని, మొదటి రోజు అక్కడక్కడ తలెత్తిన సాంకేతిక సమస్యలను కూడా వెంటనే పరిష్కరించడం జరిగిందని తెలిపారు.
రైతులు కూడా ఈ యాప్ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని, వారికి వారి ఊరిలో ఏ డీలర్ దగ్గర ఎంత స్టాక్ ఉందో తెలుస్తుందని, తద్వారా వారు బుక్ చేసుకొని, వారికి నచ్చిన సమయంలో షాప్ వద్దకు వెళ్లి ఒటిపి చూపించి కొనుగోలు చేసారని తెలిపారు. ఈ రెండు రోజుల్లో యాప్ విజయవంతం కావడంతో, ఈ యాప్ ను మరికొన్ని రోజులు పరిశీలించి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి సిద్ధం కావాల్సిందిగా అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు.
ఈ రోజు రైతునేస్తం కార్యక్రమంలో కూడా రైతులకు యాప్ పై గల సందేహాలను నివృత్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈ రబీ సీజన్ కు గాను రాష్టాన్రికి ఇప్పటికే 5.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావడం జరిగిందని, యూరియా వినియోగం అధికంగా ఉండే జనవరి, ఫిబ్రవరి నెలలకు గాను సరిపడ యూరియాను ముందస్తుగానే తెప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
