స్వాతంత్య్ర సమరయోధుడు, భారత తొలి ఉప ప్రధాని, హోం మంత్రిగా స్వదేశీ సంస్థానాలను భారత యూనియన్లో విలీనం చేసిన ఉక్కు మనిషి(Iron Man), బర్డోలీ వీరుడు(Bardoli Hero), ఇండియన్ బిస్మార్క్(Indian Bismarck)గా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకల నేపథ్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఐక్యత పాదయాత్ర (Unity March) విజయవంతమైంది. దేశ ఐక్యతను ప్రతిబింబించేలా కృషి చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలకు అనుగుణంగా నేటి యువతరం ముందుకు సాగాలని గుజరాత్ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ పార్మాత్ జయంత్ సింగ్, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే (Nagarkurnool MLA) డాక్టర్ రాజేష్ రెడ్డి(Rajesh Reddy), కలెక్టర్ బాదావత్ సంతోష్ పిలుపునిచ్చారు.

శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఐక్యత మార్చ్ ఘనంగా నిర్వహించారు. కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ, మేరా యువభారత్, జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి యూనిటీ మార్చ్ పాదయాత్ర (Padayathra) కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పటేల్, బిర్సా ముండా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పాఠశాల క్రీడా మైదానం నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా గాంధీ పార్క్ వరకు ఈ పాదయాత్ర సాగింది. విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు భారీగా పాల్గొన్నారు. వందేమాతరం, జైహింద్ నినాదాలతో నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రం మార్మోగింది.
