- మరో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది.
- వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి..
కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని మరో 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పాయిపల్లి, కీర్యతండా, కాశీంనగర్, కాశీంనగర్ తాండ, చిట్యాల, పెద్దగూడెం, దత్తాయిపల్లి, చందాపురం, మెంటేపల్లి, కడుకుంట్ల, కిష్టగిరి, కిష్టగిరి తాండ, పెద్దగూడెం తాండ, నాచ హళ్లి తో పాటు పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మేఘా రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో గ్రామాలలో ఒక్క ఇల్లు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని కేవలం అభివృద్ధి పనుల మాటున అందిన కాడికి దోచుకున్నారే తప్ప గ్రామాలను పట్టించుకోలేదని విమర్శించారు.

నేడు ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సమైక్యలకు ఆర్టీసీ బస్సులు కొనుగోలు, ఉచిత విద్యుత్తు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీల పెంపు, రైతులకు రాయితీపై విత్తనాలు, యాంత్రిక పనిముట్లు లాంటి అనేక పథకాలు చేపట్టి ప్రజలకు అందించామని అన్నారు. వీటితోపాటు విద్యాపరంగా ఇంటిగ్రేటెడ్ పీ పాఠశాలలు, వైద్యపరంగా నూతన ఆసుపత్రుల నిర్మాణం, అంతర్గత రోడ్ల నిర్మాణం, విద్యుత్, తాగునీటి సమస్యల పరిష్కారం, గ్రామాలలో మౌలిక వసతుల కల్పన లాంటి అనేక పనులు చేపడుతున్నామన్నారు.

గ్రామ పంచయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలలో పూర్తిస్థాయి అభివృద్ధి కొనసాగుతుందని, అభ్యర్థులు గెలిచి రండి అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, మాజీ జెడ్పిటిసి గొల్ల వెంకటయ్య, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
