Saturday, March 28, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంTrojan Pub | నిద్ర మత్తులో అధికారులు మద్యం మత్తులో యువత

Trojan Pub | నిద్ర మత్తులో అధికారులు మద్యం మత్తులో యువత

ట్రోజన్ పబ్ చేస్తున్న లెక్కలేని ఆగడాలు

  • కూకట్ పల్లిలో నిత్యం కనిపిస్తున్న విస్తుపోయే ఘటనలు..
  • లుల్లు మాల్ లో తెల్లవార్లూ చెలరేగిపోతూ ‘ఆఫ్టర్ పార్టీ’లు..
  • నరకయాతన పడుతున్న స్థానికులు..
  • అధికారులు చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరిక..
  • విధులు మరచిన ఎక్సైజ్ శాఖ, పోలీసు అధికారులు..

దేశానికి యువత వెన్నెముక అని వివేకానందుడు సెలవిచ్చారు. ఆ మాటలు అప్పట్లో చాలా గొప్పగా అనిపించేవి.. అలాంటి గొప్ప మాటలు ఇప్పుడు కుప్పకూలి పోయాయి.. అర్ధాలు మారిపోయాయి.. అలాగే కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని శ్రీశ్రీ అన్నట్టుగా.. దేశ భవిష్యత్తును నిర్మించే అద్భుత శక్తి కలిగిన యువత మత్తుకు బానిసలై వృద్ధులుగా మారిపోతున్నారు.. ఎందుకిలా జరుగుతోంది..? ఎవరు ఈ పాపం మూటగట్టుకుంటున్నారు..?

- Advertisement -

యువతను నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని కొందరు మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇది నిజమే అనిపిస్తోంది.. తమ స్వార్ధ ప్రయోజనాలకోసం, అక్రమ సంపాదన కోసం రాత్రంతా మద్యం సరఫరా చేస్తున్న కొందరు దుర్మార్గులకు అధికారులు బాసటగా నిలుస్తున్నారు.. దీంతో యువత ఎందుకూ పనికిరాకుండా పోవడమే కాకుండా.. సమాజానికి కూడా కీడు చేస్తున్నారు.. కూకట్ పల్లి నడిబొడ్డులో నిత్యం జరుగుతున్న ఒక తంతు దీనికి సాక్షీభూతంగా నిలుస్తోంది..

కూకట్‌పల్లి నడిబొడ్డున చట్టం అపహాస్యమవుతోంది. నిబంధనలు గాలికి వదిలి. అర్ధరాత్రి 1.00 గంటకు మూతపడాల్సిన పబ్‌లు, తెల్లవారుజామున సుమారు 4 గంటల వరకు చిందులేస్తున్నాయి. ముఖ్యంగా లూలూ మాల్‌లోని ‘ట్రోజన్ పబ’ కేంద్రంగా సాగుతున్న ఈ ‘ఆఫ్టర్ పార్టీ’ సంస్కృతి స్థానికుల పాలిట శాపంగా మారింది. పోలీసులు , ఎక్సయిజ్ అధికారుల కళ్లుగప్పి లేదా వారి అండదండలతోనే ఈ దందా సాగుతోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసు, ఎక్సయిజ్ శాఖ అధికారులు తమ బాధ్యతలను తాకట్టు పెట్టి విధులను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..

తుంగలో తొక్కబడ్డ నియమ నిబంధనలు :
అర్ధరాత్రి దాటినా ఆగని చిందులు :

ఎక్సైజ్ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయానికి పబ్‌లు మూసివేయాలి. కానీ ట్రోజన్ పబ్‌లో శని, ఆదివారాల్లో తెల్లవారు జామున దాదాపు 4 గంటల వరకు మద్యం ఏరులై పారుతోంది.

బిల్లులే సాక్ష్యం :

నిబంధనలు ఉల్లంఘించి అక్రమ వ్యాపారం చేస్తు న్నారనడానికి కస్టమర్లు చెల్లించిన అర్ధరాత్రి దాటిన సమయంతో కూడిన బిల్లులే నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

నిఘా నేత్రాలు ఏమంటున్నాయి? :

లూలూ మాల్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తే, తెల్లవార్లూ సాగుతున్న వాహనాల రాకపోకలు, పబ్ నిర్వాహకుల బాగోతం బట్టబయలవుతుందని స్థానికులు సవాలు విసురుతున్నారు. విచ్చలవిడితనంతో తలకిందులవుతున్న

యువత భవిష్యత్తు :
మద్యం మత్తులో యువత :

తక్కువ వయసు వున్నవారు అంటే మైనర్లు సైతం ఈ నైట్ క్లబ్ కల్చర్ కు అలవాటు పడి మద్యానికి బానిసలవుతున్నారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి.. మద్యానికి బానిసలవుతున్న యువత చదువుకోవాల్సిన వయసులో మత్తులో జోగుతూ చేజేతులారా తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.

కుటుంబాలకు చితి :

యువత వ్యసనాల బారిన పడటంతో అనేక సామాన్య కుటుంబాలు ఆర్థికంగా రోడ్డున పడుతున్నాయి. అర్ధరాత్రి మత్తులో వాహనాలు నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

నరకప్రాయంగా స్థానికుల జీవనం :
శబ్ద కాలుష్యం :

భారీ డీజేల హోరుతో చుట్టుపక్కల నివసించే విద్యార్థులు, వృద్ధులు, ఉద్యోగులు తీవ్ర నిద్రలేమితో సతమతమవుతున్నారు.

ట్రాఫిక్ గందరగోళం :

అర్ధరాత్రి వేళ పబ్ కస్టమర్ల వాహనాల రద్దీతో స్థానిక రోడ్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. అరాచకంగా వాహనాలు నడుపుతూ స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నారు.

అధికారుల ‘మామూలు’ నిర్లక్ష్యం?:

పోలీసు, ఎక్సైజ్, ఫుడ్ సేఫ్టీ శాఖల నిఘా లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పబ్ నిర్వాహకులు ఇచ్చే ప్రలోభాలకు లోనై అధికా రులు కళ్లు మూసుకున్నారా? అనే ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తున్నా నోటీసులు ఇవ్వడానికి కూడా అధికారులు వెనుకాడుతుండటం వెనుక ఉన్న మర్మ మేంటో అర్థం కావడం లేదు.“ఇప్పటికైనా సంబంధిత ఎక్సయిజ్, పోలీసు ఉన్నతాధికారులు స్పందించి లూలూ మాల్ పరిసరాల్లోని సీసీటీవీలను తనిఖీ చేయాలి. నిబంధనలు అతిక్రమిస్తున్న టోర్జన్ వంటి పబ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.’ అని స్థానిక నివాసితులు హెచ్చరిస్తున్నారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News