కాంగ్రెస్, బీఆర్ఎస్లపై రామ్చందర్రావు ఆగ్రహం
ఇన్నాళ్లూ తెలంగాణ(Telangana)లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్ (Congress) పార్టీలు గౌడ్ సామాజికవర్గానికి తీరని అన్యాయం చేశాయని బీజేపీ (Bjp) తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రామ్చందర్రావు(N.RamchanderRao) మండిపడ్డారు. గత పదేళ్ల బీఆర్ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో హైదరాబాద్ (Hyderabad) నగరాభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అసమర్థ పాలన వల్ల హైదరాబాద్ విశ్వనగరం కాస్తా విషాద నగరంగా మారిపోయిందని ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (JubileeHills Bye Election) నేపథ్యంలో గురువారం హైదరాబాద్ మోతీ నగర్ కమ్యూనిటీ హాల్లో బిజెపి ఓబీసీ మోర్చా ‘గౌడ్ సామాజిక ఆత్మీయ సమ్మేళనం’ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రామ్చందర్రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఆయనేమన్నారంటే..
బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో రహదారులు పాడైపోయాయి. డ్రైనేజ్ వ్యవస్థ దారుణంగా మారింది. వీధి దీపాలు వెలగడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతితో ప్రజలు కనీస సౌకర్యాలకూ నోచుకోవడం లేదు. గతంలో మునిసిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్.. హైదరాబాద్లోని ప్రధాన సమస్యలను పరిష్కరించలేకపోయారు. గుంతల రహదారులు, ట్రాఫిక్ రద్దీ, మ్యాన్హోల్స్ తదితర సమస్యలన్నీ అలాగే ఉన్నాయి. పది సంవత్సరాల్లో ఆయన సాధించిందేంటి?. సీఎం రేవంత్రెడ్డి మునిసిపల్ శాఖను తన వద్దే ఉంచుకున్నారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.2,000–3,000 కోట్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కానీ నిధులు విడుదల చేసిందిలేదు.

హైదరాబాద్ ప్రజల అభివృద్ధి కన్నా మతపరమైన ఓట్ల కోసమే ఈ రెండు పార్టీలు పోటీపడుతున్నాయి. కేవలం 20% ఓటు బ్యాంకు కోసం వాగ్దానాలు చేస్తూ నగరానికి ప్రాణమైన 80% ప్రజలను పూర్తిగా విస్మరించాయి. ఎర్రగడ్డలో ప్రభుత్వ భూమిని ఖబరస్థాన్కు ఇచ్చే కాంగ్రెస్ ప్రయత్నాలను బీజేపీ నాయకులు దీపక్ రెడ్డి, రఘునందన్ రావు అడ్డుకున్నారు. ప్రజల హక్కులను రక్షించారు. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఈ విషయంలో మౌనంగా వ్యవహరించాయి. వారి అసలు స్వభావం ఇదే.
మోదీజీ నాయకత్వంలోనే తొలిసారి బీసీ వర్గాలకు గౌరవం, గుర్తింపు, హక్కులు లభించాయి. రాబోయే కుల గణన (Caste Census) ద్వారా సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా, న్యాయంగా బీసీ వర్గాల వరకు చేరతాయి. జూబ్లీహిల్స్ ప్రజల సమస్యలపై అసెంబ్లీలో బలమైన గొంతుకగా నిలిచే బలమైన నాయకుడు కావాలి. నిజమైన అభివృద్ధి, బాధ్యత కలిగిన నాయకత్వం ఇవ్వగలిగేది కేవలం బిజెపి మాత్రమే. బిజెపికి మద్దతుగా నిలిస్తే పాయల్ శంకర్ వంటి నాయకులతో కలిసి దీపక్రెడ్డి ప్రజా సమస్యలపై బలమైన స్వరంగా నిలుస్తారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్.. గౌడ్ సమాజ జీవనాధారాన్ని ధ్వంసం చేసిన పార్టీలు. వైఎస్ఆర్ పాలనలో కాంగ్రెస్ జారీ చేసిన జి.ఓ 676తో రాష్ట్రవ్యాప్తంగా తాటి కంపౌండ్లను మూసివేసి, గౌడ్ సమాజం జీవనాధారాన్ని పూర్తిగా నాశనం చేసింది. ఆ అన్యాయాన్ని బీఆర్ఎస్ కూడా కొనసాగించింది. కానీ.. బీజేపీ మాత్రం గౌడ్ సమాజ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నది. గౌడ్ల జీవనోపాధి, గౌరవం, ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీనే. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు తమ పార్టీలపైనా, ప్రజలపైనా నిబద్ధత లేదు. వారికి రాజకీయ ప్రయోజనం ముఖ్యం. కానీ.. బీజేపీకి ప్రజల సంక్షేమమే ధ్యేయం.
ఈ కార్యక్రమంలో బీజేపీ MLA అభ్యర్థి దీపక్ రెడ్డి, MLA పాయల్ శంకర్, మాజీ ఎంపీ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్య గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
