- ప్రకటించిన బీసీసీఐ
- జూన్ 26, 28 తేదీలలో నిర్వహణ..
- ఫెవరేట్ గా టీం ఇండియా..
టీ20 వరల్డ్ చాంపియన్స్ టీమిండియా.. జూన్లో ఐర్లాండ్తో రెండు మ్యాచ్లు ఆడనున్నది. దీనిపై ఇవాళ బీసీసీఐ ప్రకటన రిలీజ్ చేసింది. జూన్ 26, 28 తేదీల్లో ఆ మ్యాచ్లను నిర్వహించనున్నారు. ఆ రెండు మ్యాచ్లు బెల్ఫాస్ట్ వేదికగా జరగనున్నాయి. 2007 తర్వాత మళ్లీ బెల్ఫాస్ట్ మైదానంలో ఇండియన్ జట్టు టీ20 మ్యాచ్ ఆడనున్నది. టీమిండియా సీనియర్ జట్టు జూన్లో ఐర్లాండ్కు వెళ్లనున్నట్లు బీసీసీఐ తన ప్రకటనలో వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు గత ఎనిమిదేళ్లలో మూడు సార్లు ఐర్లాండ్లో భారత్ పర్యటించింది. 2018, 2022, 2023 సంవత్సరాల్లో ఐర్లాండ్ టూరుకు ఇండియా వెళ్లింది.
కానీ బెల్ఫాస్ట్లో 2007 తర్వాత ఆడడడం ఇదే మొదటిసారి అవుతుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. భారత్ టూరు గురించి రెండు రోజుల క్రితమే ఐర్లాండ్ డైరెక్టర్ గ్రాహమ్ వెస్ట్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. జూన్లో ఆఫ్ఘనిస్తాన్తో ఓ టెస్టు మ్యాచ్, మూడు వన్డేలు ఆడిన తర్వాత భారత జట్టు ఐర్లాండ్ వెళ్తుంది. ఆఫ్ఘన్తో సిరీస్ జూన్ 20 నాటికి ముగుస్తుంది. ఇక ఇంగ్లండ్ పర్యటన కన్నా ముందే ఐర్లాండ్లో రెండు టీ20 మ్యాచ్లను ఇండియా ఆడనున్నది. జూలై ఒకటి నుంచి 19 వరకు ఇంగ్లండ్తో 5 టీ20లు, మూడు వన్డేలు ఇండియా ఆడనున్న విషయం తెలిసిందే.
