జవహర్ నగర్ పరిధిలో శ్రీ రామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివిధ కాలనీలలో ఆలయాలు భక్తులతో కిక్కిరిసి, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కళ్యాణ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో సాగాయి. శ్రీరామ్ నగర్ కాలనీ శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవానికి మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రంగుల సతీష్, మాజీ కార్పొరేటర్ కూతడి సాయికుమార్, విజయ్ కుమార్ కాలనీవాసులు పాల్గొన్నారు. అంబేద్కర్ నగర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో వేద పండితుల సాన్నిధ్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించారు. ప్రగతి నగర్ ఫైర్విట్టర్ కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జవహర్ నగర్ హనుమాన్ దేవాలయంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవంలో మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ మహేందర్ రెడ్డి, మాజీ మేయర్ మేకల కావ్య, కొండల్ ముదిరాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించి భక్తులకు ప్రసాదాలు అందించారు. జవహర్ నగర్ పరిధిలోని పలు కాలనీలలో ఈ కళ్యాణ మహోత్సవాలు భక్తి వాతావరణంలో ఘనంగా కొనసాగాయి.



