- నేడు తలపడనున్న సౌత్ ఆఫ్రికా, న్యూజిల్యాండ్ జట్లు..
- తొలి సెమీస్ లో విజయం ఎవరిది అన్నదానిపై ఉత్కంఠ..
సుమారు నెల రోజులుగా భారత్, శ్రీలంకలో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ తుది దశకు చేరుకుంది. ఈ టోర్నీలో లీగ్, సూపర్-8 దశకు తెరపడగా ఇక మిగిలింది మూడు మ్యాచ్లే. 20 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో గ్రూప్-1 నుంచి దక్షిణాఫ్రికా, భారత్ సెమీస్కు అర్హత సాధించగా గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్, న్యూజిలాండ్ బెర్త్లు దక్కించుకున్నాయి. బుధవారం నుంచి మొదలుకానున్న నాకౌట్ దశలో భాగంగా..
బుధవారంనాడు రాత్రి దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ కోల్కతాలోని ఈడెన్గార్డెన్ వేదికగా తొలి సెమీస్ ఆడనున్నాయి. టోర్నీలో పడుతూ లేస్తూ ఆడుతున్న కివీస్.. ఓటమన్నదే లేకుండా సెమీస్ చేరిన సఫారీలను ఏ మేరకు అడ్డుకుంటుందన్నది ఆసక్తికరం.
ఐసీసీ టోర్నీలలో న్యూజిలాండ్కు.. దక్షిణాఫ్రికాపై మెరుగైన రికార్డు ఉంది. ముఖ్యంగా నాకౌట్ దశలలో ఆ జట్టుదే పైచేయిగా ఉంది. 2011, 2015 వన్డే ప్రపంచకప్ క్వార్టర్స్లలో కివీస్ గెలిచింది. నిరుడు చాంపియన్స్ ట్రోఫీ సెమీస్లోనూ న్యూజిలాండ్.. 50 పరుగుల తేడాతోవిజయం సాధించింది.
ఈడెన్ గార్డెన్లో టాస్ అత్యంత కీలకం. రాత్రి పూట ఇక్కడ మంచు కారణంగా ఫీల్డింగ్ టీమ్కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు.. తమ స్కోరును డిఫెండ్ చేసుకోవడం కష్టమే. ఇటీవలే ముగిసిన భారత్, వెస్టిండీస్ మ్యాచ్ అందుకు తాజా ఉదాహరణ. అందుకే టాస్ గెలిచిన జట్టు మరో ఆలోచన లేకుండా మొదట ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలున్నాయి.
