- రాజకీయ లబ్ధి కోసమే సిట్ నోటీసులు జారీ.
- ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు రేవంత్ కొత్త డ్రామాకు తెర.
- ఓటు ద్వారా కె.సి.ఆర్ మీద అభిమానం చాటుకోవాలి.
- మన జిల్లా మనకు కావాలంటే బి.ఆర్.ఎస్ పార్టీకి ఓట్లు వేయాలి.
- మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి..
ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రేవంత్ రెడ్డి పెండింగ్లో ఉన్న ఫోన్ టాపింగ్ ముందుకేసి కొత్త డ్రామాలు తెరపైకి తెస్తారని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. దీనిలో భాగంగానే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ జాతిపిత కె.సి.ఆర్ ని విచారణ పేరుతో సిట్ నోటీసులు జారీ చేశారని ఫైర్ అయ్యారు. విచారణ పేరుతో కేసీఆర్ ను వేధించడాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యములో ఆదివారం అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన చేతకాక ప్రజల దృష్టి మరల్చడానికి రెండేళ్లుగా కె.సి.ఆర్ పై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని నిరంజన్ ఘాటుగా విమర్శించారు. ఎంత వ్యక్తిగతంగా కె.సి.ఆర్ ని వేధిస్తే ప్రజల మద్దతుతో కె.సి.ఆర్ ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతారని హితావు పలికారు. కాంగ్రెస్ పార్టీ తన వెకిలి చేష్టలు మానుకోకపోతే ఇంతకు పదింతల మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.

జిల్లాను ముట్టుకుంటే అగ్గిరాజేస్తాం.
10 ఏండ్ల క్రింద పరిపాలన సౌలభ్యం కోసం కె.సి.ఆర్ వనపర్తి జిల్లా ఏర్పాటు చేసి అభివృద్ధికి తోడ్పడితే .. ఈ తీస్మార్ ఖాన్ వచ్చి మన జిల్లాను రద్దు చేస్తాం అని అంటున్నారని ప్రజలు విజ్ఞతతో ఆలోచించి జిల్లా ఇచ్చిన బి.ఆర్.ఎస్ పార్టీకి ఓటు వేస్తారో లేక జిల్లా రద్దు చేస్తాం అన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారో ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు. జిల్లాను రద్దు చేయడానికి పూనుకుంటే బిఆర్ఎస్ పవర్ ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.

వేగుల వ్యవస్థ రాజరికం నుండి ఉంది.
రాజ్యాంగం ద్వారా సంక్రమించిన సి.ఎం కి రాష్ట్రంలో శాంతిభద్రతలు, సాంఘిక కార్యకలాపాలు, తీవ్రవాద సమస్య వంటి సమాచారం ఇంటలిజెన్సీ అందజేస్తుందని .. ఈ మాత్రం అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిలిపి, వెకిలి చేష్టలు చేస్తుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ విధ్వంస పాలనకు స్వస్థి పలికి కె.సి.ఆర్ సంక్షేమ పాలనకు అండగా నిలవాలని నిరంజన్ రెడ్డి కోరారు.

సంక్షేమం చేతకాక సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది.
మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్..
అక్రమ కేసులు పెట్టడం మాని మహిళకు 2500, తులం బంగారం, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, విద్యార్థులకు విద్యా బరోసా, విద్యార్థినులకు స్కూటీలు, ధాన్యానికి బోనస్, గ్యాస్ సబ్సిడీ, రైతులకు రైతు భరోసా, రైతు రుణ మాఫీ, రైతు బీమా పథకాలు అమలు చేయాలని స్వామి గౌడ్ డిమాండ్ చేశారు. రాస్తారోకో కార్యక్రమములో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్స్, బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.
