- రాగిరి సతీష్ గౌడ్కు న్యాయశాస్త్రంలో గౌరవ డాక్టరేట్
చెన్నైలోని భారతీయ విద్యా భవన్స్లో వైభవంగా నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ న్యాయవేత్త రాగిరి సతీష్ గౌడ్కు న్యాయశాస్త్రంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. సమాజానికి ఆయన అందిస్తున్న న్యాయసేవలు, ప్రజల హక్కుల పరిరక్షణలో చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందజేశారు.
ఈ వేడుకలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా ప్రజాసేవలో విశిష్ట పాత్ర పోషించిన గుమ్మడి నర్సయ్య, పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య, తెలంగాణకు చెందిన కూతాడి కుమార్లతో పాటు రాగిరి సతీష్ గౌడ్ కూడా డాక్టరేట్ అవార్డును అందుకోవడం విశేషం. తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖులు ఒకే వేదికపై ఈ గౌరవాన్ని అందుకోవడం కార్యక్రమానికి మరింత గౌరవాన్ని తీసుకువచ్చింది.
న్యాయంపై విశాలమైన పట్టు కలిగిన సతీష్ గౌడ్, తన జ్ఞానాన్ని కేవలం వృత్తి పరంగా మాత్రమే కాకుండా సామాజిక న్యాయం సాధనకు వినియోగిస్తూ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అన్యాయానికి గురైన వారికి అండగా నిలుస్తూ, హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఆయన సేవలు కొనసాగిస్తున్నారు.
