మాదాపూర్లోని ఆవాస హోటల్లో బ్లిస్ బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ సేవా సంస్థ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో సేవా భావన, మానవత్వం స్పష్టంగా ప్రతిబింబించాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బ్లిస్ బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ సంస్థ చైర్మన్ అయిన దుండ్ర కుమారస్వామి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జీవోదయ ఎన్జీవో వ్యవస్థాపకురాలు డాక్టర్ నిర్మల, ఆవాస హోటల్ మేనేజ్మెంట్ తరఫున జి.ఎం. స్వప్న, మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా జీవోదయ హోమ్కు చెందిన 100 మంది అనాధ పిల్లలు, దివ్యాంగులతో కలిసి క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఆవాస హోటల్లో అనాధ పిల్లలకు ప్రత్యేక విందు ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది.
ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ, యేసు ప్రభువు జీవితం మానవాళికి సార్వత్రిక మార్గదర్శకమని అన్నారు. కరుణ, సమానత్వం, శాంతి, ప్రేమ, దయ – ఇవే యేసు బోధనల సారాంశమని తెలిపారు. మతాలకు అతీతంగా యేసు సందేశాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు. నిస్సహాయుల పట్ల కరుణ చూపడమే నిజమైన మానవత్వమని స్పష్టం చేశారు. చిన్న సేవలే నిజమైన ఆనందం, శాంతికి మార్గమని ఆయన తెలిపారు. సమాజ అభివృద్ధికి యేసు బోధనలు దిశానిర్దేశకంగా నిలుస్తాయని అన్నారు.
