ఈ నెల 16వ తేదీన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీశైలం దర్శనానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైల మహాక్షేత్రం అభివృద్ధికి నూతన ప్రతిపాదనలను దేవస్థానం అధికారులు సిద్ధం చేశారు. శ్రీశైల మల్లన్న ఆలయానికి దాదాపు రూ.1,657 కోట్ల ఆర్థిక సహాయం చేయాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఆధ్వర్యంలో ప్రధానిని కోరనున్నారు.
క్షేత్రంలో కాశీ విశ్వనాథ్ కారిడార్, ఉజ్జయిని మహాకాళ్ కారిడార్ తరహాలో శ్రీశైల క్షేత్ర కారిడార్ను అభివృద్ధి చేయడానికి సదరు నిధులు వినియోగించాలని దేవాదాయశాఖ, దేవస్థానం అధికారులు యోచిస్తున్నారు. అందుకుగాను రూ.90 కోట్లతో నూతన క్యూకాంప్లెక్స్, రూ.65 కోట్లతో గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు సాలుమండపాల నిర్మాణం, రూ.25 కోట్లతో కైలాస మానస సరోవరం-ఏనుగుల చెరువు కట్ట అభివృద్ధి, రూ.25 కోట్లతో కైలాస కళాక్షేత్రం, రూ.13 కోట్లతో నూతన ప్రసాదాల తయారీ పోటు నిర్మాణం, రూ.10 కోట్లతో సామూహిక అభిషేక మండప నిర్మాణం, రూ.5 కోట్లతో దేవస్థానం వర్క్షాప్ నుంచి రుద్రపార్కు వరకు బ్రిడ్జి నిర్మాణం, రూ.95 కోట్లతో సిద్ధరామప్ప కొలను అభివృద్ధి పనులు చేయాలని ఈవో ఎం. శ్రీనివాసరావు ఇప్పటికే దేవాదాయశాఖ అనుమతి కోరారు.
శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం అభివృద్దిపై దేవాదాయ, అటవీశాఖలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిగిన దివ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఆలయ సమగ్రాభివృద్దిపై చర్చించారు.