Friday, October 10, 2025
ePaper
HomeజాతీయంPM Kisan | దీపావళికి ముందే పీఎం కిసాన్ పైసలు...

PM Kisan | దీపావళికి ముందే పీఎం కిసాన్ పైసలు…

దీపావళి పండగకి ముందే కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు మరో శుభవార్త అందించడానికి సిద్ధమైంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 21వ విడత నిధులను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. దీపావళికి రెండు రోజుల ముందు పీఎం కిసాన్ నిధులు జమ చేయనుంది. అక్టోబర్ 18న దీపావళి కానుకగా  21వ విడత నిధులు జమ చేయనుందని జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. దాంతో ప్రతి రైతుకు రూ.2,000 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ కానున్నాయి. ఈ నిర్ణయంతో కోట్లాది మంది రైతన్నలకు పండుగ సమయంలో ఆర్థిక ఊరట లభించనుంది. ఈ నిధుల విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. అయితే, లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసే ప్రక్రియ ఇప్పటికే తుది దశకు చేరుకుందని తెలుస్తోంది.

కేంద్రం ఈ పథకం కింద అర్హులైన రైతులందరికీ ఏటా మూడు విడతల్లో మొత్తం రూ.6,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ 21వ విడత నగదు బదిలీ ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, పీఎం-కిసాన్ లబ్ధిదారులు తమ ఖాతాల్లో డబ్బులు జమ కావడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలని అధికారులు ముఖ్య సూచనలు జారీ చేశారు.

ముఖ్యంగా, ఈ-కేవైసీ ప్రక్రియను ఇంకా పూర్తి చేయని వారు వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నారు. అంతేకాకుండా, ఆధార్ కార్డును బ్యాంక్ ఖాతాతో లింక్ చేయని రైతులు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ రెండు ముఖ్యమైన పనులు పూర్తి కాకపోతే, నిధులు పొందడంలో జాప్యం జరిగే లేదా నిధులు నిలిచిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రైతులు తమ వివరాలను సరిచూసుకొని, నగదు జమ అయ్యేందుకు అవసరమైన అన్ని ప్రక్రియలను సకాలంలో పూర్తి చేసుకోవడం ఉత్తమం.

RELATED ARTICLES
- Advertisment -

Latest News