- వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి..
పెబ్బేరు పట్టణానికి 300 ఏళ్ల చరిత్ర ఉందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు. చౌడేశ్వరి మాత ఉత్సవాల సందర్భంగా ఆయన మంగళవారం చౌడేశ్వరి మాత కు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధికి 5 లక్షల రూపాయల విరాళం అందించి .. విలేకరులతో మాట్లాడారు. 3 వందల సంవత్సరాల క్రితమే పెబ్బేరు మండలం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. బండ లాగుడు పోటీల సందర్భంగా వేణుగోపాల స్వామి రథోత్సవం, చెలిమిల్లలో నిర్వహించిన అంతర్రాష్ట్ర వృషభ రాజా బండ గుంజే పోటీలను ప్రారంభించి కొద్దిసేపు తిలకించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో వృషభ రాజు బండ లాగుడు పోటీలు ఎంతో ఉత్సాహంగా కొనసాగుతాయని .. ప్రత్యేక శ్రద్ధతో వృషభ రాజుల పోషణ చేస్తున్న వారందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు. పోటీలలో గెలుపు, ఓటములు సహజమని ఎవరు ఎలాంటి నిరుత్సాహానికి గురి కాకుండా ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, పట్టణ మాజీ అధ్యక్షులు వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.

