- హెచ్ఆర్సీ ని ఆశ్రయించిన పాపన్నపేట రైతులు
- సింగూర్ నీటి విడుదలకు విజ్ఞప్తి
- మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి
గత కొన్ని రోజులుగా సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్(వనదుర్గ) ఆయకట్టుకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ వస్తున్న మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ మెదక్ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి రైతులతో కలిసి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘంను ఆశ్రయించారు. సింగూర్ ప్రాజెక్ట్ నుంచి వెంటనే నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని కోరుతూ పాపన్నపేట రైతులతో కలిసి హెచ్ఆర్సీ కమిషనర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ..
బీఆర్ఎస్ పాలనలో పదేళ్ల పాటు రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించామని, సింగూర్ జలాలను మెదక్ జిల్లాకు అంకితం చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్దేనని పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా తీసుకున్న చర్యల వల్ల జిల్లాలో వ్యవసాయం అభివృద్ధి చెందిందని తెలిపారు. ప్రస్తుతం ఘనపూర్ (వనదుర్గ) ఆయకట్టు పరిధిలో పంటలు నీటి కొరతతో ఎండిపోతున్నాయని, ప్రభుత్వం ఆలస్యంగా క్రాప్ హాలిడే ప్రకటించడంతో రైతులు నష్టపోయారని ఆమె విమర్శించారు. పంటలు పొట్ట దశలో ఉన్న ఈ సమయంలో కనీసం ఒక్క తడి నీరు అందిస్తే పంటలను కాపాడవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు.
సింగూర్ ప్రాజెక్ట్ లో ప్రస్తుతం ఉన్న దాదాపు ఏడు టీఎంసీల నుంచి ఘణపురం ఆనకట్టకు 0.3 టీఎంసీ నీటిని అత్యవసరంగా విడుదల చేసి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని హెచ్ఆర్సీని కోరారు. హెచ్ఆర్సీ కమిషనర్ రైతుల సమస్యలపై సానుకూలంగా స్పందించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న కమిషనర్, సంబంధిత అధికారులతో చర్చించి తగిన సిఫారసులు చేస్తానని హామీ ఇచ్చారు. పద్మా దేవేందర్ రెడ్డి వెంట నాయకులు మామిండ్ల ఆంజనేయులు, లావణ్య రెడ్డి, ఏడుపాయల శ్రీనివాస్ గౌడ్, బద్రి మల్లేశం తదితరులు ఉన్నారు.
