సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ (OG) చిత్రం అభిమానులు ఊహించినట్టే కలెక్షన్లలో రికార్డు సృష్టించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు (గ్రాస్) సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది. సెప్టెంబరు 25న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో రూ.308 కోట్లకుపైగా (OG 11 Days Collections) కలెక్షన్లు రాబట్టింది. ‘రూల్స్ లేవు. చట్టాలు లేవు. గంభీర ‘లా’ మాత్రమే ఉంది. ఇతడే ఒరిజినల్ గ్యాంగర్ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఎక్స్లో సినిమా వసూళ్ల వివరాలు ప్రకటించింది.
విడుదల రోజే ‘ఓజీ’ రూ.154 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. తొలిరోజు ఈ స్థాయి కలెక్షన్లు పవన్ కల్యాణ్ కెరీర్లోనే రికార్డు. దాదాపు రూ.300 కోట్ల కలెక్షన్లతో వెంకటేశ్ అనిల్ రావిపూడి ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇప్పటివరకు ఈ ఏడాదిలో టాప్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పుల్న్ కలెక్షన్లను ‘ఓజీ’ 11 రోజుల్లోనే అధిగమించింది. వీరాభిమాని దర్శకుడై సినిమా చేస్తే ఎలా ఉంటుందో సుజీత్ ఓజీతో చూపించారు. ఓజస్ గంభీరగా పవన్ను తెరపై స్టైలిష్గా ఆవిష్కరించారు. ఈ సినిమా, దాని విజయం కేవలం ట్రైలర్ లాంటివన్న సుజీత్.. భవిష్యత్తులో దీనికి రెట్టింపు సందడి ఉంటుందంటూ ప్రీక్వెల్, సీక్వెల్ని ఖరారు చేశారు. ఇప్పటికే ‘ఓజీ’ ప్రీక్వెల్, సీక్వెల్లపై పని మొదలుపెట్టినట్టు సుజీత్ వెల్లడించారు. ప్రీక్వెల్లో పవన్ కుమారుడు అకీరా నందన్ కనిపించనున్నాడా అనే ప్రశ్నపై ఆయన, “ఇప్పుడే చెబితే థ్రిల్ ఉండదు” అంటూ ఆసక్తిని రేకెత్తించారు.