- పేదల బియ్యం పక్కదారి.. నిర్మల్లో అక్రమ రవాణాపై ఆరోపణలు
పేద ప్రజల ఆకలి తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం కొందరు అక్రమార్కుల చేతుల్లో పడి పక్కదారి పడుతోందన్న ఆరోపణలు నిర్మల్ జిల్లాలో వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆశయాలకు గండి కొడుతూ పేదలకు అందాల్సిన బియ్యాన్ని అక్రమంగా సేకరించి తరలిస్తున్నారనే చర్చ స్థానికంగా సాగుతోంది.
కొందరు ప్రైవేటు వ్యక్తులు సిండికేట్గా ఏర్పడి ఈ అక్రమ రేషన్ బియ్యం వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కొంతమంది లబ్ధిదారులు, అలాగే కొందరు రేషన్ డీలర్ల సహకారంతో తక్కువ ధరకు బియ్యాన్ని సేకరించి అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. లబ్ధిదారులకు అందాల్సిన కోటాలో కొంత భాగాన్ని మాయం చేస్తూ, రికార్డుల్లో మాత్రం అన్నీ సక్రమంగానే ఉన్నట్లు చూపిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

విశ్వసనీయ సమాచారం ప్రకారం, చిన్న చిన్న లూనా, ఈచర్ వంటి వాహనాల్లో జిల్లాలోని పలువురు రేషన్ డీలర్ల వద్ద, గ్రామాల్లోని లబ్ధిదారుల వద్ద నుంచి బియ్యాన్ని సేకరిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అనంతరం వాటిని జిల్లా కేంద్రంలోని కొన్ని గోదాముల్లో నిల్వ ఉంచి, రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా రైస్ మిల్లులకు తరలిస్తున్నారనే ప్రచారం స్థానికంగా జరుగుతోంది.
ఈ అక్రమ రవాణాను అరికట్టాల్సిన సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అక్రమ రవాణాపై సమాచారం ఉన్నప్పటికీ కొందరు అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తనిఖీలు, చర్యలు నామమాత్రంగానే జరుగుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిర్మల్ జిల్లాలో జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని, సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీసి, అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
