వరుస బ్లాక్బస్టర్లతో దూసుకెళ్తున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కొత్త సినిమా షూటింగ్ (New Movie Shooting) ప్రారంభమైంది. వీరసింహారెడ్డి సంచలన విజయం తర్వాత బ్లాక్బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni)తో మరోసారి చేతులు కలిపారు. ఈ ఇద్దరి కొలాబరేషన్లో హిస్టారికల్ ఎపిక్ #NBK111 చిత్రాన్ని ప్రతిష్టాత్మక వృద్ధి సినిమాస్ బ్యానర్పై నిర్మాత వెంకట సతీష్ కిలారు గ్రాండ్గా నిర్మిస్తున్నారు.

బాలకృష్ణ సరసన నయనతార (Nayanatara) కథానాయికగా నటిస్తున్నారు. సింహ, జై సింహా, శ్రీ రామరాజ్యం తర్వాత బాలకృష్ణ, నయనతార కలిసి నటిస్తున్న నాలుగో చిత్రం ఇది. ఈ ప్రాజెక్టు హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ స్క్రిప్ట్ను నిర్మాతలకు అందజేశారు. బాలకృష్ణతో అనేక బ్లాక్బస్టర్లను అందించిన దర్శకుడు బి.గోపాల్ క్లాప్ కొట్టారు. బాలయ్య కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి షాట్కు బోయపాటి శ్రీను, బాబీ, బుచ్చిబాబు సమిష్టిగా దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ దర్శకులు, నిర్మాతలు అనేక మంది ప్రముఖులు అతిథులు హాజరయ్యారు.

గోపీచంద్ మలినేని తొలిసారిగా హిస్టారికల్ డ్రామాలోకి అడుగుపెడుతున్నారు. కమర్షియల్ బ్లాక్బస్టర్స్ రూపొందించే తన ప్రత్యేక మాస్ టచ్ను ఒక భారీ చారిత్రక కథలో మిళితం చేస్తూ నందమూరి బాలకృష్ణను ఇప్పటివరకు చూడని ఓ కొత్త అవతార్లో చూపించబోతున్నారు. స్పెషల్ పోస్టర్లో బాలకృష్ణ.. ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో యాంకర్ పట్టుకొని అఖండమైన రాజసంతో కనిపించారు. గడ్డం, పొడవాటి జుట్టు, శక్తివంతమైన తీరుతో సమరశూరుడిలా అదరగొట్టారు.

హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం భావోద్వేగాలు, అద్భుతమైన యాక్షన్, విజువల్ వండర్గా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచబోతోంది. మిగిలిన తారాగణం, సాంకేతిక సిబ్బందికి సంబంధించిన వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు. ప్రధాన తారాగణం: నందమూరి బాలకృష్ణ, నయనతార. సాంకేతిక సిబ్బంది.. రచన, దర్శకత్వం గోపీచంద్ మలినేని, నిర్మాత.. వెంకట సతీష్ కిలారు, బ్యానర్.. వృద్ధి సినిమాస్, పీఆర్వో.. వంశీ-శేఖర్.
