కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే సందర్భంగా అధికారులకు వినతి
నల్గొండ పట్టణం(Nalgonda Town)లోని పలు వార్డుల్లో ప్రారంభించి మధ్యలో నిలిపివేసిన సీసీ రోడ్ల నిర్మాణాన్ని తక్షణం పూర్తిచేయాలని నల్గొండ మునిసిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ (Former Floor Leader) కొండూరు సత్యనారాయణ పురపాలక ప్రత్యేక అధికారి(Special Officer)ని కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. పలు వార్డుల్లో అసంపూర్తిగా ఉన్న రోడ్లను యుద్ధప్రాతిపదికన సిమెంట్ రోడ్లుగా నిర్మాణం పూర్తిచేయాలని పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ డే (Grievance Day) సందర్భంగా మునిసిపాలిటీ స్పెషల్ ఆఫీసర్, అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్) అమిత్ నారాయణకి బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఆధ్వర్యంలో పలు వార్డుల ప్రజలతో కలిసి వినతి పత్రం అందజేశారు.

సగం చేసి.. వదిలేసి..
నల్గొండ పట్టణంలోని 3, 18, 19 నంబర్ వార్డుల్లో ప్రధాన రోడ్ల నిర్మాణ పనులను అసంపూర్తిగా వదిలేశారని, దీనివల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సత్యనారాయణ చెప్పారు. ‘దుమ్ము, ధూళితో ఆరోగ్య సమస్యలు (Health Problems) ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వర్షా కాలంలో ఈ ప్రాంతం బురదమయమవుతోంది. దీంతో రాకపోకలకు కష్టమవుతోంది’ అని అధికారుల దృష్టికి తెచ్చారు. గతంలో ఆమోదించి పలు కారణాలతో నిలిచిపోయిన ఈ పనులను పూర్తిచేస్తే మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లవుతుందని తెలిపారు. మునిసిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ను కలిసినవారిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంగలి సైదులు, పుట్ట కోటయ్య, బుక్య ప్రసాద్, వెంకన్న, ఆవుల యోగి, సుజాత, నర్సిరెడ్డి, చలపతి రెడ్డి తదితరులు ఉన్నారు.

