Monday, October 27, 2025
ePaper
HomeజాతీయంNarendra Modi | రామాలయం తరవాత రెండో దీపావళి

Narendra Modi | రామాలయం తరవాత రెండో దీపావళి

  • ధర్మాన్ని కాపాడాం.. ప్రతీకారం తీర్చుకున్నం
  • అన్యాయాన్ని ఎదురించే ధైర్యం రాముడే ఇచ్చాడు
  • ప్రజలకు దీపావళి శుభాకాంక్షల్లో మోడీ ప్రస్తావన

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలను ఉద్దేశిస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీ ఓ లేఖ రాశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ఆపరేషన్ సిందూర్ కు శ్రీరాముడే స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ భారత ధర్మాన్ని కాపాడటంతో పాటు.. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుందన్నారు. ‘అయోధ్యలో రామాలయం నిర్మించిన తర్వాత ఇది రెండో దీపావళి. ధర్మాన్ని కాపాడాలని శ్రీరాముడు మనకు బోధించాడు. అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు. కొన్ని నెలల క్రితం మనం చేపట్టిన ఆపరేషన్ సిందూరే దీనికి ఉదాహరణ. మనం భారత ధర్మాన్ని కాపాడటంతో పాటు ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం. ఈ దీపావళికి మరో ముఖ్యమైన ప్రత్యేకత ఉంది.

మావోయిస్టుల నుంచి విముక్తి పొందిన అనేక జిల్లాలతో పాటు మారుమూల ప్రాంతాల్లో కూడా దీపావళి వెలుగులు నిండాయి. మన దేశ రాజ్యాంగంపై విశ్వాసంతో అనేకమంది హింసా మార్గాన్ని విడిచిపెట్టి.. జన జీవన స్రవంతిలోకి వచ్చిన అనేకమందిని మనం ఇటీవల చూశాం అని పేర్కొన్నారు. ఇది దేశానికి ఇది ఒక గొప్ప విజయం అని పేర్కొన్నారు. ఈసందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ రేట్లను తగ్గించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఈ జీఎస్టీ రేట్ల తగ్గింపు కారణంగా ప్రజలకు పెద్ద మొత్తంలో లబ్ది చేకూరుతుందన్నారు. ఇక, పౌరులు స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని మోడీ పిలుపునిచ్చారు. అన్ని భాషలను గౌరవించాలన్నారు. ప్రతిఒక్కరూ పరిశుభ్రతను పాటించాలన్నారు. మనం తీసుకునే ఆహారంలో నూనె వాడకాన్ని 10 శాతం తగ్గించి.. యోగాను ఆచరిద్దామన్నారు.

ఈ ప్రయత్నాలన్నీ.. మనల్ని వికసిత్ భారత్ వైపు నడిపిస్తాయన్నారు. శక్తి, ఉత్సాహం నిండిన ఈ పండగ వేళ.. దేశ పౌరులందరికి ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం దేశ పౌరులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాశారు. దసరా నవరాత్రులు ప్రారంభ వేళ.. జీఎస్టీ ధరలను భారీగా తగ్గించామన్నారు. ఇదంతా భవిష్యత్తు తరం కోసం సంస్కరణలలో భాగంగా వీటిని చేపట్టామన్నారు. ఈ సంస్కరణల కారణంగా దేశంలోని పౌరులకు రూ. వేల కోట్లు ఆదా చేయడానికి దోహదపడుతుందని తెలిపారు. అంతే కాకుండా ఈ నిర్ణయం జీవితాన్ని సులభతరం చేయడంతోపాటు ఆర్థిక వృద్ధిని పెంచుతుందన్నారు. ఇక భారత్, ఉత్తమ భారత్ స్ఫూర్తిని నిలబెట్టడం కోసం స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. అన్ని భాషల పట్ల గౌరవం పెంపొందించుకోవాలని సూచించారు. అలాగే ఆరోగ్యంపై అవగాహన సైతం కల్పించుకోవాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News