- పదో తరగతి టాపర్లకు విమాన ప్రయాణం చేయించిన ఎమ్మెల్యే సౌమ్య
- ‘కలలకు రెక్కలు’ పేరుతో వినూత్న కార్యక్రమం
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించేందుకు నందిగామ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆరుగురు విద్యార్థులకు తన సొంత ఖర్చులతో విమాన ప్రయాణం చేయించి వారి కలను నిజం చేశారు.
‘కలలకు రెక్కలు’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా, నందిగామ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఎంపిక చేశారు. ఎమ్మెల్యే సౌమ్య స్వయంగా విద్యార్థులతో కలిసి మంగళవారం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు విమానంలో పయనమయ్యారు. విద్యార్థులకు విమాన ప్రయాణ అనుభూతిని అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. హైదరాబాద్ పర్యటన అనంతరం సాయంత్రం విద్యార్థులందరితో కలిసి కారులో నందిగామకు తిరిగి రానున్నారు.
తమ పిల్లల విమాన ప్రయాణ కలను నెరవేర్చినందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో స్ఫూర్తి నింపేందుకు ఎమ్మెల్యే సౌమ్య చేపట్టిన ఈ కార్యక్రమాన్ని స్థానికులు, విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు. ఈ చొరవ భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు బాగా చదివేందుకు ప్రోత్సాహాన్ని అందిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
