Friday, February 27, 2026
Homeసాహిత్యంMax Muller | మనకెంతో మేలు చేసిన మాక్స్ ముల్లర్

Max Muller | మనకెంతో మేలు చేసిన మాక్స్ ముల్లర్

మాక్స్ ముల్లర్ 19వ శతాబ్దంలో భారతీయ సాహిత్యాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప భాషావేత్త(Linguist), తాత్వికుడు(Philosopher), తులనాత్మక మత శాస్త్రవేత్త. ఆయన భారతీయ వేద సాహిత్యానికి చేసిన సేవల కారణంగా భారతీయ సాంస్కృతిక అధ్యయనాల్లో ఓ కీలక స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలిచారు.

మాక్స్ ముల్లర్ 1823 డిసెంబర్ 6న జర్మనీ(Germany)లోని డెసావ్ పట్టణంలో జన్మించారు. ఆయన తండ్రి ప్రముఖ కవి, రచయిత. చిన్నతనం నుంచే ముల్లర్‌కు భాషలపై ఆసక్తి. లైప్జిగ్ విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్రం (Philology) చదివిన ముల్లర్.. తర్వాత ఫ్రాన్స్, ఇంగ్లాండ్‌లో సంస్కృతం, తత్వశాస్త్రంలో అధ్యయనాలను విస్తరించారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా స్థిరపడి సార్వత్రిక పరిశోధనలను కొనసాగించారు.

- Advertisement -

మాక్స్ ముల్లర్ భారతీయ సాహిత్యం(Indian literature)పైన ముఖ్యంగా వేదాల పట్ల ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదాలను పఠించి వాటిని పాశ్చాత్య సమాజానికి పరిచయం చేయడం కోసం ఇంగ్లిష్‌లోకి అనువదించారు. ఆయన ముఖ్య రచనల్లో సేక్రెడ్ బుక్స్ ఆఫ్ ది ఈస్ట్ (Sacred Books of the East) ఎంతో ప్రసిద్ధి. 50 సంపుటాల గ్రంథమాలగా ప్రచురించితమైంది. ఇందులో వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బౌద్ధ గ్రంథాలు, జైన గ్రంథాలు, ఇస్లామిక్, జరస్త్రియన్ గ్రంథాల అనువాదాలు ఉన్నాయి.

ముల్లర్.. తులనాత్మక మతశాస్త్రానికి పునాది వేశారు. భిన్న మతాలు, సాంస్కృతిక గ్రంథాల తులనాత్మక విశ్లేషణ ద్వారా మానవ సమాజాల ఆధ్యాత్మిక వికాసాన్ని అర్థంచేసుకోవచ్చని విశ్వసించారు. భారతీయ తత్వశాస్త్రం, పాశ్చాత్య తత్వం మధ్య సారూప్యాలను గుర్తించి రెండు సంస్కృతుల మధ్య అనుబంధాన్ని ఆవిష్కరించారు.

ముల్లర్ ముఖ్యంగా వేదాలను మానవతా చింతనకు మూలాధారాలు అని పేర్కొన్నారు. ఆయన దృష్టిలో వేదాలు కేవలం హిందువుల పుణ్య గ్రంథాలు మాత్రమే కాదు. ప్రపంచ మానవాళికి చెందిన ఆధ్యాత్మిక మౌలిక గ్రంథాలు.

ముల్లర్ భారతీయ సంస్కృతిని గౌరవంతో పరిగణించేవారు. వేదాలు భారతీయుల ఆత్మ అని పేర్కొంటూ భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానాన్ని సానుకూల దృక్కోణంతో విశ్లేషించారు. ఆయనకు భారతీయ ధర్మం, తాత్త్విక సూత్రాల పట్ల ఎంతో ఆసక్తి ఉండేది.

అయితే.. కొందరు విమర్శకులు ముల్లర్‌పై పాశ్చాత్య వలసవాద దృక్కోణంతో భారతీయ సాహిత్యాన్ని అర్థంచేసుకున్నారని అభిప్రాయపడ్డారు. ఆయన అనువాదాలు పాశ్చాత్య పాఠకుల కోసం కాస్త మార్పుచేర్పులకు గురయ్యాయని విమర్శనాత్మకంగా పేర్కొన్నారు.

ముల్లర్ జీవితకాలంలో అనేక కీలక రచనలు చేశారు. వాటిలో ముఖ్యమైనవి.. ఋగ్వేదంపై విశ్లేషణ, ఉపనిషత్తుల అనువాదాలు, ప్రాచీన ఆధ్యాత్మిక గ్రంథాల సమాహారం, తాత్త్విక వ్యాసాల సమాహారం.

ముల్లర్ అనువాదాలు, విశ్లేషణలు విస్తృతంగా గౌరవం పొందాయి. కొన్ని మాత్రం విమర్శలు ఎదుర్కొన్నాయి. భారతీయ మత సాంప్రదాయాలపై పాశ్చాత్య అర్థాలను రుద్దారని, పాశ్చాత్య పరిశోధనల పట్ల మక్కువతో తాత్త్విక అంశాలను ఒడిసిపట్టారని విమర్శకులు అభిప్రాయపడ్డారు.

అయినప్పటికీ.. భారతీయ వేద సాహిత్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రచురించిన ముల్లర్ కృషి చిరస్థాయిగా నిలిచిపోయింది.
మాక్స్ ముల్లర్ 1900 అక్టోబర్ 28న మరణించారు. ఆయన సాహిత్య కృషి భారతీయ సాహిత్య, తాత్విక అధ్యయనాలపై ఎనలేని ప్రభావం చూపింది. భారతీయ వేదాలు, తత్వశాస్త్రాలపై పాశ్చాత్య ఆసక్తి పెరగడానికి ఆయన కృషి దోహదపడింది.

మాక్స్ ముల్లర్ ప్రపంచానికి భారతీయ సంస్కృతిని పరిచయం చేసిన గొప్ప పాశ్చాత్య వేదాంతి. ఆయన చేసిన తాత్త్విక, సాహిత్య కృషి, వేదాలపై చేసిన విశ్లేషణలు భారతీయ, పాశ్చాత్య ప్రపంచాల మధ్య సంస్కృతిక మార్పిడి సాధించాయి. భారతీయ సాహిత్యం, తాత్వికతపై ముల్లర్ చూపిన ఆసక్తి, శ్రద్ధకు భారతీయులు ఎప్పటికీ రుణపడి ఉంటారు.

(డిసెంబర్ 6న మాక్స్ ముల్లర్ జయంతి సందర్భంగా)

  • రామకిష్టయ్య సంగనభట్ల
- Advertisement -
RELATED ARTICLES

Latest News