- ఇదో సూపర్ ఎమర్జెన్సీ లాంటిదే.. మరోమారు మండిపడ్డ మమతా
ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్రం, ఎన్నికల కమిషన్పై విమర్శలు గుప్పించారు. డీమోనిటైజేషన్, ఎస్ఐఆర్ డ్రైవ్ను ఒకేగాట కడుతూ మొదటిది ‘నోట్బందీ’ అయితే, రెండవది ‘ఓట్బందీ’ అని అన్నారు. సిలిగురిలో సోమవారంనాడు మీడియాతో మాట్లాడుతూ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఎస్ఐర్ డ్రైవ్ చేపట్టాల్సిన అవసరం ఏముందని మమతా బెనర్జీ ప్రశ్నించారు.
ఈ చర్యను సూపర్ ఎమర్జెన్సీతో ఆమె పోల్చారు. ఎస్ఐఆర్ పక్రియను ఉపసంహరించుకోవాల్సిందిగా ఈసీని కోరారు. ఎస్ఐర్ను విమర్శించినందుకు బీజేపీ తనను జైలుకు పంపినా, గొంతు కోసినా ప్రజల ఓటు హక్కులను మాత్రం ఊడలాక్కోలేరని అన్నారు. ఎస్ఐఆర్ పేరుతో ప్రజలను బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం వేధిస్తోంది. నోట్లరద్దు ఎలాటిందో ఓట్బందీ కూడా అలాంటిదే. ఎన్నికలకు ముందు ఇంత హడావిడిగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకో నాకు అర్ధం కావడం లేదు. ఈసీ తక్షణం ఈ పక్రియను ఆపేయాలి. ఓటర్ల జాబితా రివిజన్ అనేది రెండు మూడు నెలల్లో పూర్తయ్యేది కాదు, బలవంతంగా దీన్ని నిర్వహిస్తున్నారు’ అని మమత ఆక్షేపణ తెలిపారు.
తొమ్మిది రాష్టాల్రు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో గత వారంలో ఎస్ఐర్ డ్రైవ్ మొదలైంది. డిసెంబర్ 9 నాటికి ముసాయిదా ఎన్నికల జాబితాను విడుదల చేస్తామని, ఫిబ్రవరి 7న తుది జాబితాను పబ్లిష్ చేస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. రెండో విడత ఎస్ఐఆర్ పక్రియ నిర్వహిస్తున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ ఉన్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమబెంగాల్లో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. అదే ఏడాది ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో అసోం కూడా ఉంది.
