మహబూబ్నగర్ ఎంపీ (Mahabubnagar MP) డీకే అరుణ.. నారాయణపేట జిల్లా (Narayanapeta District) పర్యటనలో భాగంగా శుక్రవారం విలేఖరుల సమావేశం (Press Meet) నిర్వహించారు. ప్రజలు తమకు అందుబాటులో ఉండేవారిని సర్పంచ్లు(Sarpanch)గా ఎన్నుకోవాలని కోరారు. పంచాయతీ ఎన్నికల్లో డబ్బు ప్రభావం (Money Effect) కనిపిస్తుండటం పట్ల విచారకరం వ్యక్తం చేశారు. ‘డబ్బులు పెట్టి గెలిచిన నేతలకు పనులు చేయాలనే ఆలోచన ఉండదు. గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ (Congress), BRS ప్రభుత్వాలు ఇచ్చిన నిధులు శూన్యం. చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదు.
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గతంలో PCC చీఫ్ హోదాలో సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి మర్చిపోయారు. గ్రామాల అభివృద్ధికి నిధులు ఇస్తోంది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. గ్రామాల్లో NRGS నిధులతోనే CC రోడ్లు మొదలుకొని అనేక పనులు జరుగుతున్నాయి. గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులను దారిమళ్లిస్తున్నారు. అందుకే కేంద్రం నేరుగా సర్పంచ్ల ఖాతాల్లో నిధులు వేస్తోంది.
అనేక గ్రామాలకు ఇప్పటికీ రోడ్లు లేవు. నారాయణపేటలో అనేక గ్రామాల్లో రోడ్లకు ప్రతిపాదనలు పెట్టాం. పలు రోడ్లకు అనుమతులు వచ్చాయి. PMశ్రీ పథకం కింద పాఠశాలల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేంద్రం నుంచి వస్తున్నాయి. వాటి నిర్మాణాల్లో కూడా ఆలస్యం చేస్తున్నారు. ప్రతి పథకంలో 60 శాతం కేంద్రం నిధులు ఉన్నాయి. నన్ను నమ్మి సర్పంచ్, వార్డు మెంబర్లుగా బీజేపీ మద్దతుదారులను గెలిపించండి. ఎంపీ నిధుల నుంచి ఆయా గ్రామాలకు 10 లక్షలు అభివృద్ధికి అందజేస్తాను.
కాంగ్రెస్కు ఓటు వేస్తేనే ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని మభ్యపెడుతున్నారు. కేంద్రం నిధులతోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంపై విశ్వాసం ఎవరికీ లేదు. భూములు అమ్మి ప్రభుత్వం నడుపుతున్నారు. గ్రామాభివృద్ధి కోసం ప్రజలు ఓట్లు వేయాలి. డబ్బులు ఇచ్చారని మొహమాటంతో ఓట్లు వేయకండి. గ్రామాలను అభివృద్ధి చేసే మోదీ సర్కార్కు అండగా ఉండాలి’ అని డీకే అరుణ సూచించారు.
