బీజేపీని అంతర్గతంగా నాశనం చేస్తున్నదెవరు?
తెలంగాణలో ఆ పార్టీ పతనమైతే లాభమెవరికి?
గులాబీ పార్టీకి మేలు చేయడమే లక్ష్యమా?
అందుకే ‘ఓటమి’ వ్యూహాలు రచిస్తున్నారా?
ఇన్నాళ్లూ తామే ప్రత్యామ్నాయమని ఘనంగా చెప్పుకున్న వైనం
ఇప్పుడు డిపాజిట్ కూడా తెచ్చుకోలేని గడ్డు రోజులు ఎందుకొచ్చాయి?
అధిష్టానం జోక్యం చేసుకోకపోతే పాతాళానికి పడిపోతుందా?
తెలంగాణలో బీజేపీ ఎందుకు నిలదొక్కుకోలేకపోతోంది?
అసలు సమస్యలేంటి?
ఒక రాష్ట్రంలో పార్టీ బలపడాలంటే పలు అంశాలు ప్రధానం
సమష్టి నాయకత్వం, క్షేత్ర స్థాయి క్యాడర్కు గౌరవం, నీట్ అండ్ క్లియర్ వ్యూహం తప్పనిసరి
కానీ.. తెలంగాణలో పరిస్థితి దీనికి ఎందుకు వ్యతిరేకంగా ఉంది?

మన దేశంలో అజేయ శక్తిగా ప్రకాశిస్తున్న కమలం పార్టీకి తెలంగాణ(Telangana)లో గడ్డు పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి? దేశంలో బీజేపీ (Bjp) గెలుపు పరంపర కొనసాగిస్తుంటే ఇక్కడ మాత్రం ఓటముల వరుస ఎందుకు కొనసాగిస్తోంది? ఇది ప్రజా తీర్పు ఫలితమా? లేక, తెలంగాణ బీజేపీని అంతర్గతంగా బలహీనపరిచే ఒక ‘సైలెంట్ ఆపరేటర్’ (Silent Operator) వ్యూహమా? పార్టీలోనే ఒక కీలక నేత.. బయట కమలం ధరించి లోపల మాత్రం పూర్తిగా భిన్న దిశలో పనిచేస్తున్నాడనే గుసగుసలు దుమారం రేపుతున్నాయి.
ఒకప్పుడు రాష్ట్రంలో పాలక పక్షానికి ప్రత్యామ్నాయ శక్తిగా దూసుకెళ్లిన బీజేపీకి ఇవాళ డిపాజిట్ (Deposit) కూడా రాకపోవడం ఘోరం. ఇది ఓటర్ల (Voters) తిరస్కారం మాత్రమే కాదు.. లోలోపల ఏదో పెద్ద ద్రోహం (Betrayal) నడుస్తోందనే సంకేతమని కేడర్ (Cadre) స్పష్టంగా చెబుతోంది. జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితంపై కీలక నేతల మౌనం, గులాబీ పార్టీకున్న అండర్హ్యాండ్ అంగీకారాలు, రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాలు.. ఇవన్నీ కలిపి చూస్తే తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను నిలిపేసి, పతనానికి నెట్టే పథకం నడుస్తోందనే అనుమానం జనాల్లో, బీజేపీ శ్రేణుల్లో బలపడుతోంది. ఇది ఒక్క జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓటమి కాదు. తెలంగాణ కమల భవిష్యత్తుపై వేలాడుతున్న పెద్ద ప్రశ్న.
ఒక నేత మదిలో దాగి ఉన్న ‘మాస్టర్ ప్లాన్’ ఈ ఓటమికి కారణమా?
ఒక ముఖ్య నేత బీజేపీని రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని పావులు కదుపుతున్నాడని పార్టీ నేతలు పెద్దగా చర్చించుకుంటున్నారు. నిజానికి ఇది తన అసలు వ్యూహమా? లేక, బీజేపీ ఎదిగితే తన ప్రాధాన్యం కోల్పోతుందనే భయంతోనే కమలం ఆకర్షణను తగ్గించే స్క్రిప్ట్ రాస్తున్నారా? లేక, గులాబీ పార్టీకే దారి సాఫీ చేయడం ఆ నేత అసలు ఉద్దేశమా? అనేది తేలాల్సి ఉంది. ఈ ప్రశ్నలు ఒట్టి అనుమానాలు మాత్రమే కావు.
వరుస రాజకీయ ఘటనల ఆధారంగా పుట్టిన ఆలోచనలు. జూబ్లీహిల్స్ బైపోల్ సమయంలో బీజేపీలోని చాలా మంది ప్రముఖ నేతలు ‘ఇది మా పని కాదు’ అనే అభిప్రాయంతో దూరంగా ఉండటం కేడర్ను తీవ్రంగా కలవరపెట్టింది. పార్టీని విస్తరింపజేయాలంటే ప్రతి ఉపఎన్నికను, ప్రతి వార్డును సీరియస్గా తీసుకోవాలి. కానీ.. ఇక్కడ ముఖ్య నేతల మౌనం, నిర్లక్ష్యం, దూరంగా ఉండడం.. ఇవన్నీ ఒక వ్యూహం కాకపోతే ఏమనుకోవాలి?
సమష్టి నేతృత్వం ఎక్కడ?
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి బలమైన నాయకుల కొరత లేదు. వీరిలో కొంత మంది చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. కానీ.. వీరు ఎవరికివారే అన్నట్లు తమ దారి తామే చూసుకుంటున్నారన్న విమర్శ కూడా ఉంది. ఎవరికి ఎవరి మీద కోపం, ఎవరి మీద అసూయ, ఎవరి మీద భయం ఉన్నాయో ఎవరికీ తెలియడంలేదు. ఇది పార్టీని లోలోపలే చీల్చేసింది. ఎవరికి వారు “నేనే నాయకుడు” అనే భావనలో ఉండగా పార్టీకి దారి చూపేవారు లేకుండా పోయి నాయకత్వ లోపం ఏర్పడింది..
గ్రౌండ్ రియాలిటీ పట్ల నేతలకి అవగాహన లేకపోవడం
ఇక్కడి నేతలకు ఎన్నికల సమయంలో పెద్ద పెద్ద మాటలు చెప్పడం ఒక్కటే పని అయింది. కానీ.. అసలు గ్రౌండ్లో ఏం జరుగుతోందనేదానిపై అవగాహన లేదు. తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు. క్యాడర్ సమస్యలు ఎవరూ పట్టించుకోవడంలేదు. బూత్ స్థాయిలో పని చేసే కార్యకర్తలు సమస్యలు చెప్పుకుందామన్నా వినే నేతలు మచ్చుకైనా లేరు. కార్యకర్తలకు ఒక అజెండా ఇవ్వరు. సమన్వయమనేదే లేదు. పార్టీలో కేవలం మీడియా రాజకీయాలు మాత్రమే జరుగుతున్నాయి. గ్రౌండ్ స్థాయి పని మాత్రం దాదాపు నిలిచిపోయింది.
పార్టీ కన్నా ఇగోలే ముఖ్యమా?
పార్టీ కన్నా వ్యక్తిగతంగా ఎదగడమే ఇక్కడి నేతలకు ముఖ్యమైపోయింది. ఎవరు పెద్ద నాయకుడు అనే పోటీ, ఎవరు సీఎం ఫేస్ కావాలన్న పందెం, ఎవరితో ఫొటోలు ఎక్కువ వస్తాయన్న హోరు.. ఇవన్నీ కలిసి పార్టీని బలహీనపరిచాయి. ఇదే నిజమైన హైపోథీసిస్. బీజేపీ తెలంగాణలో బలంగా ఎదిగితే తమ స్థానాలు, తమ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందనే భావన కొందరు ప్రముఖ నేతల్లో ఉన్నట్లు క్యాడర్ చెబుతోంది.
రాష్ట్రంలో బీజేపీ బలపడాలంటే ఏం చేయాలి?
బీజేపీ తెలంగాణలో నిజంగా బలపడాలంటే ముందుగా పార్టీ నేతలు తమ వ్యక్తిగత అహంకారాలను, ఆత్మగౌరవాలను పక్కనపెట్టి ఒకే నేతృత్వం కింద కట్టుదిట్టంగా నిలబడాలి. ప్రస్తుతం నడుస్తున్న మాదిరిగా పది మంది పది వైపులకు వెళ్లిపోతే పార్టీ ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. సింగిల్ లైన్ కమాండ్ లేకుండా ఏ యుద్ధం గెలవదు. గ్రౌండ్లో పడిపోయిన క్యాడర్ను వెంటనే తిరిగి యాక్టివేట్ చేయాలి. ఎందుకంటే.. బీజేపీ అసలు బలం నాయకులు కాదు.. క్యాడర్. వారి సమస్యలు, అవసరాలు, అసంతృప్తులు అన్నీ వినాలి. వారికే కొత్త అజెండా, కొత్త దిశ ఇవ్వాలి.
మీడియా షోలకు అలవాటుపడిన పెద్దలు ఇప్పుడైనా వాస్తవాలను తెలుసుకోవాలి. ఇంటర్వ్యూలతో ఎన్నికలు గెలవలేరు. ఇంటింటికి వెళ్లి ఓటర్ చేతి మీద చేయిపెట్టి మాట్లాడితేనే ఓటు వస్తుంది. గులాబీ ఆకర్షణకు దగ్గరగా కనిపించే ‘సైలెంట్ అండర్స్టాండింగ్’ను వెంటనే కట్ చేయాలి. పార్టీ లోపల గులాబీ స్నేహాన్ని పెంచుతున్నారన్న అనుమానాలు వచ్చే నేతలను కేంద్ర నాయకత్వం కఠినంగా పరిశీలించాలి. 2028 ఎన్నికలను నేటి నుంచే టార్గెట్ చేస్తూ కొత్త వ్యూహం రచించాలి. వచ్చే ఉపఎన్నికలైనా, స్థానిక ఎన్నికలైనా.. ప్రతి పోరాటాన్ని యుద్ధ స్థాయిలో తీసుకుంటేనే బీజేపీ తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ నిలబడగలదు.
