- స్వామివారి పరకామణి దోపిడీ.. ఎక్స్ వేదికగా వైకాపా నేతలపై మంత్రి లోకేశ్ విమర్శలు
వైకాపా గజదొంగలు శ్రీవారి సొత్తూ దోచుకున్నారు. వందకోట్ల పరకా’మనీ’ దొంగ వెనుక ఆ పార్టీ నేతలు ఉన్నారని మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. శ్రీవారిని కూడా దోపిడీ చేయడం దుర్మార్గమని అన్నారు. ఈ మేరకు వీడియోను ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. జగన్ ఐదేళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలింది. అరాచకం పెచ్చరిల్లింది. దొంగలు, దోపిడీదారులు, మాఫియా డాన్లకు ఏపీని కేరాఫ్ అడ్రస్ మార్చారు. గనులు, భూములు, అడవులు, సమస్త వనరులతోపాటు- జనాన్ని దోచుకున్న జగన్ గ్యాంగ్.. చివరకు తిరుమల శ్రీవారి సొత్తునూ వదల్లేదు. తాడేపల్లి ప్యాలెస్ ఆశీస్సులు, నాటి తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అండదండలతో తిరుమల పరకామణిలో దొంగలు పడ్డారు. రూ.కోట్ల విలువైన సొత్తు కొల్లగొట్టారు. ఆ డబ్బులు రియల్ ఎస్టేట్లో పెట్టు-బడులు పెట్టారు. తిరుపతిలో భూమన నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు వాటాలు అందాయని నిందితులే చెబుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఎంతో నమ్మకంతో కట్టిన ముడుపులు, హుండీలో వేసిన కానుకలు రూ.వందల కోట్లు రవికుమార్ దోచుకుని వెళ్లినప్పుడు తితిదే చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి.. అతడి మనుషులు ఏకంగా ఈ కేసును లోక్ అదాలత్లో రాజీ చేయడానికి యత్నించారు. అధికార అండతో జగన్ గ్యాంగ్ శ్రీవారికి చేయని అపచారం లేదు. భక్తులు మహా ప్రసాదంగా భావించే లడ్డూను కల్తీ చేశారు. అన్న ప్రసాదాన్ని భ్రష్టు పట్టించారు. తిరుమల దర్శనాలను అమ్మేసి సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం దుర్లభం చేశారు. ఏడుకొండల జోలికి వెళ్లొద్దు, శ్రీవారికి అపచారం తలపెట్టవద్దని.. నాడు చంద్రబాబు బతిమాలి చెప్పినా జగన్ వినలేదు. ఏడుకొండలవాడు చాలా పవర్ ఫుల్ సామీ. ఆయనకు అపచారం తలపెట్టినా, ఆయన సన్నిధిలో అవినీతికి పాల్పడినా.. ఏం జరుగుతుందో తెలిసికూడా జగన్, భూమన ఏకంగా పరకామణినే దోచేశారు. గుడిలో హుండీని దోచేసిన పాపాలతో జగన్ గ్యాంగ్ పాపం పండింది. పరకామణి వీడియోలు ఈరోజు బయటపడ్డాయి. నిందితులే వైకాపా పాపాల చిట్టా విప్పబోతున్నారని లోకేశ్ పేర్కొన్నారు.