సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల టెన్త్ విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లిస్తానన్న కిషన్ రెడ్డి.. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్కు లేఖ రాసిన కిషన్ రెడ్డి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ఎస్ఎస్ సీ బోర్డు పరీక్ష ఫీజును తానే కడతానని ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఎంపీగా తనకు వచ్చే వేతనం నుంచి భరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అందించిన అంత్యోదయ స్ఫూర్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు.
పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఈ సందర్భంగా ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ అంశంపై హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందనకు రాసిన లేఖను ఆయన ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఏ ఖాతాలో ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయాలనే విషయాన్ని తనకు తెలియజేయాలని కలెక్టరు కోరారు. అలాగే, పాఠశాలల వారీగా పదో తరగతి విద్యార్థుల వివరాలు, ఎంత మొత్తాన్ని జమ చేయాలనే వివరాలను కూడా తెలియజేయాలన్నారు. ఇదిలావుంటే కరీంనగర్లో ఇంతకుముందే ఇదే విధానాన్ని మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు.
