బీఆర్ఎస్ పార్టీ(BRS Party) నుంచి కాంగ్రెస్ పార్టీ(Congress Party)లోకి ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే(Khairatabad Mla) దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అని తేల్చిచెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కమిషన్ ఎన్నికల్లో(GHMC Elections) హస్తం పార్టీని గెలిపించబోతున్నామని ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) వ్యాప్తంగా 300 డివిజన్లలో తిరిగి కాంగ్రెస్ పార్టీ, ఏంఐఏం పార్టీల తరఫున ప్రచారం చేస్తానని తెలిపారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని చెప్పారు. తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్(Assembly Speaker) గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) ఇటీవల తిరస్కరించిన నేపథ్యంలో దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
దానం నాగేందర్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా కూడా పోటీ చేసిన సంగతి తెలిసిందే. శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఐదుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లనే తిరస్కరించారు. మరో ఐదుగురు శాసన సభ్యులపై దాఖలైన పిటిషన్లపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారనేది తెలియట్లేదు. ఈ ఐదుగురిలో దానం నాగేందర్ ఉండటం గమనార్హం. స్వయంగా ఆయనే తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని ప్రకటించడంతో అనర్హత వేటు పడటం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి.
