సిట్కి కేసీఆర్ జవాబు
ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో తనకు ఇచ్చిన నోటీసులపై మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గురువారం స్పందించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) కోరినట్లుగా శుక్రవారం విచారణకు హాజరుకాలేనని చెప్పారు. మరో రోజు ఎప్పుడైనా తనను ఎర్రవల్లిలో ఇన్వెస్టిగేట్ చేయొచ్చని స్పష్టం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లోని నంది నగర్ నివాసంలో అందుబాటులో ఉండాలని సిట్ కోరగా దానికి కేసీఆర్ ప్రత్యుత్తరం రాశారు.
మునిసిపల్ ఎన్నికల(Municipal Elections) నేపథ్యంలో నామినేషన్లకు శుక్రవారమే చివరి తేదీ అని, అభ్యర్థులను ఖరారుచేసే పనిలో తీరిక లేకుండా ఉన్నానని కేసీఆర్ వెల్లడించారు. శుక్రవారం విచారణకు హాజరుకాలేకపోతుండటానికి గల కారణాలను వివరిస్తూ జూబ్లీహిల్స్ ఏసీపీ పి.వెంకటగిరికి 2 పేజీల లేఖ రాశారు. ఇక మీదట తనకు ఇవ్వబోయే నోటీసులను తాను ఉంటున్న ప్రాంతానికి(ఎర్రవెల్లికి) పంపాలని సూచించారు. సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.
మాజీ సీఎంగా, ప్రతిపక్ష నాయకుడిగా, బాధ్యత గల పౌరుడిగా తన బాధ్యతలను తాను నిర్వర్తిస్తానని కేసీఆర్ పేర్కొన్నారు. సెక్షన్ 160 సీఆర్పీసీలోని రూల్స్ ప్రకారం తనకు ముందస్తు నోటీసులు పంపించి ఆ తర్వాతే విచారించాలని తెలిపారు. 65 ఏళ్లు పైబడినవారు విచారణ కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరంలేదు. పోలీసులే వారి ఇంటికి వెళ్లి విచారణ చేపట్టాలి. అంతకుముందు.. సిట్ అధికారులు కేసీఆర్కి నంది నగర్ నివాసంలో నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
