- ప్రేమ వ్యవహారం నేపథ్యంలో విషాదం
జవహర్ నగర్ పరిధిలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదుదారు పాంపరి పద్మ తెలిపిన వివరాల ప్రకారం, తన కుమారుడు పాంపరి అరవింద్ (24) రాపిడో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతను గత ఐదు సంవత్సరాలుగా తమ బంధువైన చింతల శిరీషతో ప్రేమలో ఉన్నట్లు కుటుంబ సభ్యులకు తెలిసి, ఈ విషయమై తరచూ కుటుంబంలో వివాదాలు జరుగుతున్నాయి.
మార్చి 31న ఉదయం సుమారు 11 గంటలకు అరవింద్ పని కోసం వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఫోన్ చేయగా తర్వాత మాట్లాడతానని చెప్పి కాల్ ముగించాడు. అనంతరం ఫిర్యాదుదారు తన నైట్ డ్యూటీకి వెళ్లినట్లు తెలిపారు. ఏప్రిల్ 1న తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో అరవింద్ గది తలుపు కొద్దిగా తెరిచి ఉండటాన్ని అతని తండ్రి గమనించాడు.
గదిలోకి వెళ్లి చూడగా, అరవింద్ చీరతో ఇనుప రాడ్కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే కిందకు దించగా అప్పటికే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈ ఘటనపై ఫిర్యాదుదారు పోలీసులకు సమాచారం అందించగా, కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
