భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం
హైడ్రాపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి కౌంటర్
మాజీ మంత్రి కేటీఆర్ (Ktr) హైడ్రాను భూతంలా చూపించే ప్రయత్నం చేస్తున్నారని భువనగిరి ఎంపీ (Bhuvanagiri Mp) చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(JubileeHills Bye Election)ల్లో ఓట్లు దండుకోవడం కోసం ఆయన ఈ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను కాపాడేందుకు హైడ్రాను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీసుకొచ్చారని చెప్పారు. పదేళ్ల బిఆర్ఎస్ (Brs) పాలనలో అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చారని, దానివల్ల ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయని మండిపడ్డారు. తెలంగాణ, హైదరాబాద్లో 75 శాతం చెరువులు, నాలాలు కబ్జాకు గురైనట్లు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలో 600 చెరువులు ఉంటే బిఆర్ఎస్ హయాంలో 44 చెరువులు మొత్తం మాయమయ్యాయని చెప్పారు. హైడ్రా వచ్చాక 500 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామని వివరించారు. దీనివల్ల లబ్ది పొందిన ప్రజలు, మంచి జరిగిన ప్రాంతాలవారు బయటకొచ్చి మాట్లాడాలని కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
