పల్లె ప్రజలకు నాణ్యతతో కూడిన స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, గుంతలు లేని రహదారులు అందుబాటులో ఉంచాలన్నదే తన ముందున్న ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి(Deputy CM), పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తన ప్రతి అడుగూ ఆ దిశగానే ఉంటాయని తెలిపారు. జల్ జీవన్ మిషన్(Jal Jeevan Mission), పల్లె పండగ (Palle Panduga) పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పక్కాగా పాటించాలని స్పష్టం చేశారు. పల్లె రోడ్ల సమాచారం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో త్వరలో సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించబోతున్నట్టు తెలిపారు.
‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’ (Geo Rural Road Management System) ద్వారా గ్రామీణ రోడ్ల పూర్తి సమాచారాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకునే సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. సాస్కీ నిధుల సాయంతో పల్లె పండగ2.0ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. మంగళగిరిలోని క్యాంపు ఆఫీసులో పల్లె పండగ2.0, అడవి తల్లి బాట పనుల పురోగతి, జల్ జీవన్ మిషన్, స్వమిత్ర పథకాలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటి పారుదల శాఖ, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిధులు అందుబాటులో ఉన్నా పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
అడవి తల్లిబాట, జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతంగా పూర్తి చేసేలా తక్షణం ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రతి పనిని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసేలా ఈ ప్రణాళికలు ఉండాలన్నారు. ఈ మేరకు యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సాస్కి నిధులకు అనుమతుల స్టేటస్ గురించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు సూత్రప్రాయంగా ఆమోదించారని, ఆర్థిక శాఖ నుంచి సమ్మతి రావాల్సి ఉందన్నారు. ఈ అంశంపై తక్షణం ఆర్థిక శాఖతో చర్చించాలని అధికారులను ఆదేశించారు.
