- పెండింగ్ చలాన్లపై హై కోర్టు కీలక ఆదేశాలు
- వాహనదారులకు ఊరటనిచ్చే తీర్పు…
- వాహనదారులను చలాన్ల వసూలు కోసం ట్రాఫిక్ పోలీసులు వేధించడం చట్టవిరుద్ధం..
- నిబంధనలను పర్యవేక్షించడమే మీ విధి : వెల్లడించిన హై కోర్టు
పెండింగ్ చలాన్ల వసూలు విషయంలో వాహనదారులకు ఊరటనిస్తూ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. గత కొంతకాలంగా ట్రాఫిక్ పోలీసులు చలాన్ల పేరుతో వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో, న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. రహదారులపై తనిఖీలు చేసే సమయంలో పెండింగ్ చలాన్లు ఉన్నాయని వాహనదారులను బలవంతపెట్టవద్దని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. చలాన్లు చెల్లించాలని ఒత్తిడి చేస్తూ వాహనాల కీలను లాక్కోవడం లేదా వాహనాలను అక్కడే ఆపేసి ట్రాఫిక్ నిరోధించడం వంటి చర్యలు చేపట్టకూడదని కోర్టు ఆదేశించింది.
పోలీసుల విధులు కేవలం నిబంధనలను పర్యవేక్షించడమేనని, చలాన్ల వసూలు కోసం వాహనదారులను వేధించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. ఏదైనా కారణంతో వాహనాన్ని ఆపినప్పుడు, వాహనదారుడే స్వచ్ఛందంగా తన పెండింగ్ చలాన్లను క్లియర్ చేయడానికి ముందుకు వస్తేనే పోలీసులు ఆ డబ్బును వసూలు చేయవచ్చని న్యాయస్థానం సూచించింది. ఒకవేళ వాహన దారులు ఆ సమయంలో చెల్లించడానికి ఇష్టపడకపోతే, వారిని నిర్బంధించే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేసింది. పెండింగ్ చలాన్లను వసూలు చేయడానికి ఒక పద్ధతి ఉంటుందని, నిబంధనల ప్రకారం కోర్టు నోటీసులు పంపాలని హైకోర్టు ఆదేశించింది.
పోలీసు యంత్రాంగం నిబంధనలను అతిక్రమించి రోడ్లపై నేరుగా నగదు వసూలు చేయడం సరికాదని అభిప్రాయపడింది. చట్టపరమైన ప్రక్రియ ద్వారా మాత్రమే పెండింగ్ బకాయిలను రాబట్టాలని సూచించింది. ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలాన్ల వసూలు కోసం వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారంటూ న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ఆయన తన వాదనలను వినిపిస్తూ, పోలీసులు వాహనాలను అడ్డగించి కీలు లాక్కోవడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం, పోలీసుల తీరును తప్పుబడుతూ ఈ కీలక ఆదేశాలను జారీ చేసింది.
